Share News

Maheshwaram: ఫ్యూచర్‌ సిటీలో.. ఈ-సిటీ

ABN , Publish Date - May 04 , 2025 | 03:28 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం.. ఫ్యూచర్‌ సిటీలో ఎలకా్ట్రనిక్‌ సిటీ(ఈ-సిటీ) ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 310 ఎకరాల్లో ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పాదక క్లస్టర్‌(ఈఎంసీ) ఉంది.

Maheshwaram: ఫ్యూచర్‌ సిటీలో.. ఈ-సిటీ

రాష్ట్రంలో మూడో ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పాదక క్లస్టర్‌గా నిర్మాణం

  • ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిర్యాలలో రెండు ఈఎంసీలు

  • వేలాది మందికి ఉపాధి.. మరిన్ని స్థాపిస్తాం

  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి

  • 300 కోట్ల మేర తైవాన్‌ టెలికాం పెట్టుబడులు

  • 5జీ నెట్‌వర్క్స్‌, నెట్‌వర్కింగ్‌ పరికరాల తయారీ

  • 10 ఎకరాల్లో పరిశ్రమ.. 2,500 మందికి ఉపాధి

  • త్వరలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ

  • మంత్రిని కలిసిన సీఎస్‌ రామకృష్ణారావు

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం.. ఫ్యూచర్‌ సిటీలో ఎలకా్ట్రనిక్‌ సిటీ(ఈ-సిటీ) ఏర్పాటు కానుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 310 ఎకరాల్లో ఎలకా్ట్రనిక్స్‌ ఉత్పాదక క్లస్టర్‌(ఈఎంసీ) ఉంది. ఇందులో పలు విదేశీ కంపెనీలు పరిశ్రమలను స్థాపించాయి. రావిర్యాలలోనూ 602 ఎకరాల్లో ఈఎంసీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయగా.. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీలు ఉత్పాదకతను ప్రారంభించాయి. కొత్తగా రానున్న ఈ-సిటీ మూడో ఎలకా్ట్రనిక్స్‌ క్లస్టర్‌ కానుంది. మహేశ్వరంలో ఇప్పటికే ఎల్‌ఈడీ టీవీల తయారీ కంపెనీ రేడియంట్‌ అప్లయన్సెస్‌ ద్వారా ఏటా 45 లక్షల యూనిట్ల ఉత్పత్తి జరుగుతుండగా.. 4 వేల మంది ఉపాధిపొందుతున్నారు. రూ.700 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన ప్రీమియర్‌ ఏజెన్సీస్‌ అనే కంపెనీ సౌర విద్యుత్తుకు సంబంధించి ఫలకాలు, ఇతర విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. రూ.600 కోట్ల పెట్టుబడులతో వచ్చిన ఒలెకా్ట్ర గ్రీన్‌టెక్‌ కంపెనీ ఏటా 10 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తోంది. బిలిటీ ఎలక్ట్రిక్‌ సంస్థ ఆటో-రిక్షాలను తయారు చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి జపాన్‌, అమెరికా, దక్షిణ కొరియాల్లో పర్యటించిన నేపథ్యంలో.. మరిన్ని ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మరిన్ని ఈఎంసీలను అభివృద్ధి చేయనుంది. ఈ-సిటీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భారీ ఉద్యోగాలకు అవకాశాలున్న ఎలకా్ట్రనిక్స్‌ రంగాన్ని మరింత ప్రోత్సాహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు ‘‘వేర్వేరు ప్రాంతాల్లో మరిన్ని ఈఎంసీలను ఏర్పాటు చేస్తాం. ఈ రంగంలో పెట్టుబడులకు ముందుకువచ్చే ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలను అందజేస్తాం’’ అని వివరించారు.

1 copy.jpg


టెలికాం కంపెనీతో 2,500 కొలువులు

రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన తైవాన్‌లోని సిరా నెట్‌వర్క్స్‌, తెలంగాణకు చెందిన టెలికాం కంపెనీ ఎల్‌సీజీసీ రిజల్యూట్‌ గ్రూప్‌ ప్రతినిధులతో మంత్రి శనివారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ రెండు కంపెనీల సంయుక్త ప్రాజెక్టుకు ప్రభుత్వం 10 ఎకరాలను కేటాయించనుంది. ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి ఆయా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున ఆయా కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ రెండు కంపెనీలు 10 ఎకరాల్లో సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న పరిశ్రమ ద్వారా 2,500 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని శ్రీధర్‌బాబు చెప్పారు. ఇక్కడ 5జీ నెట్‌ వర్క్స్‌, మల్టీ లేయర్‌ నెట్‌వర్కింగ్‌ సొల్యూషన్స్‌, సర్వర్లు తదితర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారన్నారు. ఈ పెట్టుబడితో భారత్‌-తైవాన్‌ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టీజీఐఐసీ సీఈవో మధుసూదన్‌, టీ-ఫైబర్‌ ఎండీ వేణు ప్రసాద్‌, సిరా నెట్‌వర్క్‌ ప్రతినిధులు చుయాన్‌, జాయ్‌ భట్టాచార్య, డౌగీయాస్‌, ఎల్‌సీజీసీ రిజల్యూట్‌ గ్రూప్‌ ప్రతినిధులు రణ్విందర్‌ సింగ్‌, గీతాంజలి సభర్వాల్‌ పాల్గొన్నారు.


త్వరలో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ వర్సిటీ

రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కొత్త ఊపిరినిచ్చేలా ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ని త్వరలో స్థాపించనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు. శనివారం తనను కలిసిన బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. క్రీడల పరంగా ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా క్రీడా అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ యువతకు శిక్షణ, అవకాశాలు అందించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఇటీవల తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌కు సలహాదారుడిగా నియమితులైన కొసరాజు లక్ష్మణ్‌కు, మీడియా కో-ఆర్డినేటర్‌గా నియమితుడైన వెంకట రమణారెడ్డికి మంత్రి నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా శ్రీధర్‌బాబు బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. సమావేశంలో బ్యాడ్మింటన్‌ సంఘం ప్రొటోకాల్‌ సమన్వయకర్త యూవీఎన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.


సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలి

  • సీఎస్‌కు మంత్రి శ్రీధర్‌బాబు సూచన

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించిన రామకృష్ణారావు శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎ్‌సకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా పనిచేసేలా అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులందరికీ చేరేలా చూడాలన్నారు.


దేశం గర్వించేలా యంగ్‌ ఇండియా పాఠశాలలు

  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    1 copy.jpg

బోనకల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): దేశం గర్వించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవనానికి ఆయన భూమిపూజ చేశారు. రాష్ట్రంలో 105 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.21వేల కోట్ల నిధులను మంజూరు చేసిందని చెప్పారు. అన్ని రాష్ట్రాలకు ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 05:29 AM