Revanth Reddy: 16 నెలల్లో 2,44,962 కోట్లు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:22 AM
16 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.2,44,962 కోట్ల పెట్టుబడులను సాధించింది. జపాన్ పర్యటనలో రూ.12,600 కోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పెట్టుబడులివి
ఈ ఒప్పందాలతో 80,500 ఉద్యోగాలు
తాజాగా సీఎం రేవంత్ జపాన్ పర్యటనలో 12,600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం
హైదరాబాద్/శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో దాదాపు రూ.2,44,962 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మేరకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 80,500 ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల పరిస్థితులపై సీఎం రేవంత్ దిగ్గజ కంపెనీలకు వివరిస్తున్నారు. గత ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా.. ఈ ఏడాది దావోస్ సదస్సులో గతంకంటే మూడు రెట్లు అధికంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 50 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్ పర్యటనల్లో భాగంగా రూ.14,900 కోట్ల మేర పెట్టుబడులను సాధించారు.
తాజాగా జపాన్ పర్యటనలో రూ.12,600 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోగా 30,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, సీఎం రేవంత్ జపాన్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్, ఎమ్మెల్యేలు ప్రకా్షగౌడ్, వీర్లపల్లి శంకర్, టీ రామ్మోహన్రెడ్డి తదితరులు సీఎంకు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి
PSR Remand Report: పీఎస్ఆర్ రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే వాస్తవాలు
Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ
Read Latest Telangana News And Telugu News