RTC Strike: రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె
ABN , Publish Date - May 06 , 2025 | 04:01 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది.

మంత్రి పొన్నంతో సంఘాల నేతల భేటీ
చర్చలతోనే సమస్యల పరిష్కారం: పొన్నం
సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తాం: ఆర్టీసీ
మా సంఘం కార్మికులు విధులకు వస్తారు
టీఎంయూ నాయకుడు అశ్వత్థామరెడ్డి
సమ్మె యథాతథం: జేఏసీ
కళాభవన్ నుంచి బస్భవన్ దాకా వందల మంది ఆర్టీసీ కార్మికుల కవాతు
హైదరాబాద్, రాంనగర్, మే 5 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో సమస్యల పరిష్కారం కోసం జేఏసీ బుధవారం నుంచి సమ్మెలోకి దిగుతోంది. సమ్మెను విజయవంతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 21 సమస్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ముందుగా ప్రకటించిన విధంగా సమ్మెకు దిగుతున్నామని జేఏసీ నేతలు చెబుతున్నారు. మరోవైపు.. సమ్మె వద్దని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో పలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్తో సోమవారం భేటీ అయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించాయి. సమ్మె వద్దని ప్రభుత్వం చెబుతుండగా, చేసి తీరుతామని జేఏసీ నేతలు పట్టుబడ్టారు. మరోవైపు.. సమ్మె కట్టడి చర్యల్లో భాగంగా ఆర్టీసీలో సమ్మెలు నిషేధమని, సమ్మెకు వెళితే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది.
సమ్మెతో ప్రజలకు ఇబ్బంది: మంత్రి
సమస్యలపై జేఏసీ చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. పలు సంఘాల నాయకులతో సమావేశం అనంతరం మంత్రి మట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు విని, పరిష్కరించేందుకు తనతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమ, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. 16 నెలల్లో ఆర్టీసీకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామన్నారు. ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ. 400 కోట్లు చెల్లించామని చెప్పారు. పీఎఫ్ ఆర్టీనైజేసన్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు కొత్తగా 3038 ఉద్యోగాల భర్తీ చేశామని, తార్నాక ఆస్పత్రి సూపర్ స్పెషాల్టీగా మార్చామని పొన్నం వివరించారు. సమ్మెకు పట్టుబడకుండా చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్మా ప్రయోగం: యాజమాన్యం
సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం మరోసారి ఎస్మాను తెరపైకి తెచ్చింది. ఎస్మా చట్ట ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేఽధం అని యాజమాన్యం ప్రకటించింది. సంస్థ నిబంధనల మేరకు సమ్మె చట్టవ్యతిరేకమైనదని, సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించింది. ఆర్థిక కష్టాల్లోనూ ఉద్యోగుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యమిస్తున్నామని, ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్న సంస్థకు సమ్మె తీరని నష్టం కలిగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. సమ్మె వల్ల సంస్థకు నష్టం వాటిల్లుతుందని, ఒక వర్గం తమ మనుగడకోసం చెప్పే మాటలకు ప్రభావితమై సమ్మెకు వెళ్తే సంస్థతోపాటు ఉద్యోగులకు నష్టం జరుగుతుందన్న విషయం మర్చిపోవద్దని వెల్లడించింది.
సమ్మెకు దూరం: అశ్వత్థామ రెడ్డి
సమ్మెకు ఇది సరైన సమయం కాదని, తాము సమ్మెకు దూరంగా ఉంటున్నామని టీఎంయూ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించామన్నారు. తమ యూనియన్కు చెందిన కార్మికులు ఎప్పటిలాగే విధులకు హాజరవుతారన్నారు. అవసరమైతే అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి యాజమాన్యానికి మరోసారి నోటీసులు ఇచ్చి సమ్మెకు వెళదామని ఆయన జేఏసీకి సూచించారు.
సమ్మె యధాతథం: జేఏసీ
సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదేలేదని, ముందుకే వెళ్తామని జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. సమ్మెకు దూరంగా ఉండాలని అశ్వత్థామ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. 2019 సమ్మె సమయంలో కేసీఆర్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీని నాశనం చేసిన కార్మిక ద్రోహి అశ్వత్థామ రెడ్డి అని విమర్శించారు. జేఏసీ ఇదివరకు ప్రకటించిన విధంగా సమ్మెకు వెళ్తున్నామని, ప్రతి ఒక్కరు సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సంఘాల నాయకులతో కాకుండా సమ్మెకు నోటీసు ఇచ్చిన జేఏసీ నాయకులను పిలిచి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తే సమ్మె విషయంలో పునరాలోచిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వెంకన్న విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తమ డిమాండ్ల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వనించి డిమాండ్లను పరిష్కారం చేయాలని లేనిపక్షంలో 6వ తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి సమ్మె చేపడ తామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్భవన్ వరకు ఆర్టీసీ కార్మికులు కవాతు నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News