TGSRTC: పల్లెవెలుగు బస్సుల్లోనూ డిజిటల్ చెల్లింపులు
ABN , Publish Date - Jul 03 , 2025 | 03:44 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు చిల్లర కష్టాల్ని దూరం చేస్తుంది.

చిల్లర కష్టాలు దూరం చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం
హైదరాబాద్, జూలై 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ప్రయాణికులకు చిల్లర కష్టాల్ని దూరం చేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ సిటీ బస్సులతోపాటు జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు నడిచే బస్సు సర్వీసుల్లో డిజిటల్ చెల్లింపు విధానాల్ని ప్రవేశ పెట్టింది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లోనూ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేనుంది.
మరో వారం పది రోజుల్లో పల్లె వెలుగు బస్సుల ప్రయాణికులు సైతం నగదు రహిత ప్రయాణ సదుపాయాన్ని పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, ఇతర యూపీఐ సేవల ద్వారా టిక్కెట్ ధరకు సరిపడా మొత్తం స్కాన్ చేసి ఆన్లైన్లో చెల్లించి టిక్కెట్ పొందవచ్చు.