Share News

Education Reform: సర్కారీ ప్రీస్కూల్స్‌ సిద్ధం

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:14 AM

రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇప్పటివరకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా ఉన్న పాఠశాల విద్యలో.. కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీస్కూల్‌) బడులు ప్రారంభమవుతున్నాయి.

Education Reform: సర్కారీ ప్రీస్కూల్స్‌ సిద్ధం

  • 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ

  • ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం

  • కొత్త ప్రవేశాలతోపాటు సమీప అంగన్‌వాడీ విద్యార్థుల విలీనం

  • ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఒక వలంటీర్‌తో బోధన

  • భవిష్యత్తులో ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

  • విద్యా కమిషన్‌ సిఫారసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇప్పటివరకు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలుగా ఉన్న పాఠశాల విద్యలో.. కొత్తగా పూర్వ ప్రాథమిక (ప్రీస్కూల్‌) బడులు ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే పూర్వ ప్రాథమిక తరగతులు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతున్న నేపథ్యంలో.. పూర్వ ప్రాథమిక పాఠశాలలు (ప్రీస్కూల్స్‌) ప్రారంభించాలని తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి రెండు నెలల క్రితం సిఫార్సు చేసింది. తెలంగాణ ఫౌండేషన్‌ స్కూల్స్‌ పేరుతో నర్సరీ నుంచి 2వ తరగతి వరకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎంకు కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి నివేదిక సమర్పించారు. దీనిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది.


అధికారులు 13 జిల్లాల్లోని 210 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో పెద్దపల్లి జిల్లాలో 46, జగిత్యాలలో 32, భూపాలపల్లి 31, సిద్దిపేట 29, హన్మకొండ 16, నిజామాబాద్‌ 15, మంచిర్యాల 14, వరంగల్‌ 13, ఆసిఫాబాద్‌ 7, కరీంనగర్‌ 3, ములుగు 1, కామారెడ్డి జిల్లాలో 1 పాఠశాల ఉన్నాయి. ఈ పూర్వ ప్రాథమిక తరగతుల్లో కొత్తగా విద్యార్థులను చేర్చుకోవడంతోపాటు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ విద్యార్థులను కూడా కలుపుతారు. సదరు అంగన్‌వాడీల కార్యకర్తలు, ఆయాతోపాటు ఒక వలంటీర్‌కు ఈ పూర్వ ప్రాథమిక తరగతుల నిర్వహణ బాధ్యత అప్పగించాలని విద్యా శాఖ భావిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత లేదు. ఎంపిక చేసిన 210 ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పూర్వ ప్రాథమిక తరగతులకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అంగన్‌వాడీ కార్యకర్తలు, వలంటీర్‌తో బోధన ప్రారంభించాలని.. తర్వాత ప్రాథమిక ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బోధన బాధ్యత అప్పగించాలని విద్యాశాఖ భావిస్తున్నట్టు సమాచారం.


నారాయణపేటలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేయండి

  • కేంద్రమంత్రి సంజయ్‌ సేథ్‌కు ఎంపీ డీకే అరుణ వినతి

న్యూఢిల్లీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి) : నారాయణపేటలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌కు మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రితో ఆయన కార్యాలయంలో బుధవారం భేటీ అయిన ఆమె గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సైనిక పాఠశాల ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైనంత త్వరగా నారాయణపేటలో సైనిక పాఠశాలను ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ డీకే అరుణ తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 04:14 AM