Heavy Rains: నేడు, రేపు అతి భారీ వర్షాలు
ABN , Publish Date - May 28 , 2025 | 03:49 AM
తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం లేకపోయినా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆరెంజ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆ ప్రభావం రాష్ట్రంపై ఉండదు: వాతావరణ శాఖ
మహబూబ్నగర్కు విస్తరించిన నైరుతి
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం
హైదరాబాద్లో జోరువాన.. స్తంభించిన ట్రాఫిక్
లోతట్టు ప్రాంతాలు జలమయం
సిరిసిల్లలో పిడుగుపాటుతో ఒకరి మృతి
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ/ ఆదిలాబాద్/ కాటారం/ కరీంనగర్/ నల్లగొండ/ నారాయణపేట, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. ఆరెంజ్ అలర్జ్ జారీ చేసింది. బుధవారం జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు దక్షిణ తెలంగాణలోని మహబూబ్నగర్ వరకూ నైరుతి రుతు పవనాలు విస్తరించాయని వెల్లడించింది. మంగళవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం రాష్ట్రంపై ఉండదని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తరలించిన ధాన్యం నీట మునిగింది. పలు జిల్లాలో వానాకాలం సీజన్ కోసం సిద్ధం చేసుకున్న ఎరువుల బస్తాలు తడిసి ముద్దవ్వగా, లోతట్టు ప్రాంతాలు వరదమయం అయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు-రామచంద్రాపురంలో అత్యధికంగా 7.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి అండర్ బ్రిడ్జి వద్ద ముంచెత్తిన వరద నీటిలో మునిగిన వాహనాలను కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 9.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయి కంటే 8.3 మి.మీ ఎక్కువ. అత్యధికంగా ఉట్నూర్ మండలంలో 29.5మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన జొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల వాంగులు పొంగి పొర్లాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశీంపేటలో 114.3 మి.మీ, రాజన్న-సిరిసిల్ల జిల్లా వేములవాడలో 102.5 మి.మీ, జగిత్యాల జిల్లా తిరుమలాపూర్లో 101 మి.మీ వర్షపాతం రికార్డయింది. కొడిమ్యాల-సూరంపేట మధ్య బుగ్గవాగు పొంగడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కథలాపూర్ మండలం పెగ్గెర్లలో పాఠశాల ప్రహరీగోడ కూలిపోయింది. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో 500 బస్తాల ధాన్యం తడిసిపోయింది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాకలో పిడుగు పడటంతో దాసరి లక్ష్మణ్ (35) అనే పశువుల కాపరి మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా నెన్నెల సమీపంలోని ఎర్రవాగు ఉప్పొంగి తాత్కాలిక వంతెన కొట్టుకుపోగా ఆరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకానిలో లక్ష్మారెడ్డి అనే రైతు మల్చింగ్తో వేసిన కూరగాయల తోట నీటిమయం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. మహదేవ్పూర్ మండల పరిధిలోని కాళేశ్వరంలో గోదావరిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. నారాయణపేట జిల్లాలో అత్యధికంగా దామరగిద్ద మండలంలో 67.0 మి.మీ, సూర్యాపేట జాజిరెడ్డి గూడెంలో అత్యధికంగా 10.2 సెం.మీ, యాదాద్రి-భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలో 5.2 సెం.మీ, నల్లగొండ జిల్లా నార్కట్పల్లి నెమ్మానిలో 1.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
నైరుతిలో పుష్కలంగా వర్షాలు
నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవనున్నాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకూ తూర్పు భారతంలో కొన్ని ప్రాంతాలు, ఈశాన్యలో ఎక్కువ ప్రాంతాలు, వాయవ్యంలో జమ్మూకశ్మీర్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటుకు 106 శాతం వర్షపాతం నమోదు కానుంది. ఈ మేరకు నైరుతి రుతుపవనాల సీజన్కు రెండో దశ అంచనా బులెటిన్ను భారత వాతావరణ శాఖ మంగళవారం విడుదల చేసింది. నాలుగు నెలల దీర్ఘకాలిక సగటు (1971 నుంచి 2020 వరకూ 87 సె.మీ)లో ఈసారి 105 శాతం(నాలుగు శాతం అటుఇటుగా) నమోదవుతుంది. దేశంలో దక్షిణ, మధ్య భారతాల్లో దీర్ఘకాల సగటు కంటే 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.