Share News

Rice Procurement: ఖరీఫ్‌ మొదలైనా ఇంకా యాసంగి కొనుగోళ్లు

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:20 AM

యాసంగి ధాన్యం సేకరణ ఈ నెలాఖరు వరకు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సాగు ఆలస్యంగా చేపట్టిన జిల్లాల్లో రైతులు వరి కోతలు కూడా ఆలస్యంగా చేపడుతున్నారు.

Rice Procurement: ఖరీఫ్‌  మొదలైనా  ఇంకా యాసంగి కొనుగోళ్లు

  • ఈనెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు

  • ఆలస్యంగా వరికోతలు చేపట్టే రైతులకోసం నిర్ణయం

  • 73 లక్షల టన్నులు దాటిన సేకరణ, 75 లక్షలకు చేరే అవకాశం

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం సేకరణ ఈ నెలాఖరు వరకు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సాగు ఆలస్యంగా చేపట్టిన జిల్లాల్లో రైతులు వరి కోతలు కూడా ఆలస్యంగా చేపడుతున్నారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావటం కూడా ఆలస్యమవుతోంది. ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం విక్రయించే ప్రతి రైతు నుంచి ధాన్యం సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈనెల 30వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీచేసింది. యాసంగి 2024-25 సీజన్‌లో 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కొనుగోళ్లు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 8,378 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. గురువారం నాటికి 73 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 70 లక్షల టన్నులు టార్గెట్‌ పెట్టుకోగా జూన్‌ నెల మొదటి వారంలోకి రాగానే లక్ష్యం పూర్తయింది. 3 లక్షల టన్నులు అదనంగా సేకరించింది. ఇంకా ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. తొలుత జూన్‌ 15 తేదీ నాటికి ధాన్యం సేకరణ పూర్తిచేయాలని ప్రభుత్వం భావించింది.


కొన్ని జిల్లాల్లో ఇంకా వరి కోతలు జరుగుతుండటం, ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడవటంతో ఆరటానికి ఇంకా సమయం పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్‌ చేసే పరిస్థితి కనిపించలేదు. మరో రెండు వారాలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే... జూన్‌ నెల 30 తేదీ వరకు కూడా రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచుతామని, చివరి రైతు తెచ్చే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మరో 18 రోజుల పాటు అవసరమున్న జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండనున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకరావటంలేదు. అలాంటి జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు సెంటర్లను మూసివేశారు. ఎక్కడ అవసరమైతే అక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న జిల్లాల్లో కూడా రోజుకు 20 వేల టన్నుల నుంచి 30 వేల టన్నుల వరకు ధాన్యం వస్తోంది. సీజన్‌లో వచ్చినంతగా కాకుండా తక్కువ పరిమాణంలో ధాన్యం వస్తోంది. ఇప్పటిరకు 73 లక్షల మెట్రిక్‌ టన్నల ఽధాన్యం సేకరించగా ఈనెలాఖరు వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచితే మరో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో యాసంగి (2024- 25) ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరే అవకాశాలున్నాయి. జూన్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నైరుతి రుతుపవనాలతో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో రైతులు వానాకాలం పంటల సాగును ప్రారంభించారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో యాసంగి ధాన్యం సేకరణ ఇంకా జరుగుతోంది.


యాసంగి ధాన్యం సేకరణలో

టాప్‌ టెన్‌లో ఉన్న జిల్లాలు

క్ర.సం జిల్లా పేరు ధాన్యం

(టన్నుల్లో)

1 నిజామాబాద్‌ 829722

2 నల్లగొండ 598032

3 జగిత్యాల 466232

4 పెద్దపల్లి 400900

5 కామారెడ్డి 382461

6 సిద్దిపేట 374964

7 భువనగిరి 367954

8 సూర్యాపేట 339511

9 మెదక్‌ 316760

10 కరీంనగర్‌ 310529

Updated Date - Jun 13 , 2025 | 04:20 AM