Share News

CM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు, దెయ్యాల రాష్ట్రసమితి: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jun 06 , 2025 | 06:30 PM

యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుమలాపూర్‌ బహిరంగ సభలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలియచెప్పారు.

CM Revanth Reddy: అది బీఆర్ఎస్ కాదు, దెయ్యాల రాష్ట్రసమితి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

ఇంటర్నెట్ డెస్క్: యాదాద్రి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిరుమలాపూర్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్‌.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మీద సీఎం విమర్శలు, సెటైర్లు సంధించారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాల విషయానికొస్తే.. 'తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. యాదాద్రి పేరుని యాదగిరిగుట్టగా మార్చాం. తిరుమల మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి, టీటీడీ మాదిరిగా వైటీడీ ఏర్పాటు చేశాం. 60 కిలోల బంగారంతో ఆలయ గోపుర నిర్మాణం, కొండపై భక్తులు నిద్రించేలా, ఆటోలు నడిచేలా చేశాం. త్వరలో యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తాం. స్థానిక విద్యాసంస్థలను వర్సిటీ స్థాయికి తీసుకెళ్తాం.' అని ప్రసంగంలో పేర్కొన్నారు. గంధమల్ల ప్రాజెక్టును గతంలో ఎందుకు పూర్తిచేయలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌, గత బీఆర్ఎస్ సర్కారుని నిలదీశారు.


ఇంకా సభలో సీఎం ఏం మాట్లాడారంటే.. 'నల్లగొండ రైతుల కష్టాలు తీర్చుతాం. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టింది. మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతాం. పేదల ఇళ్లు కూలగొడుతున్నామంటూ విష ప్రచారం చేశారు. మూసీ నది ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. సబర్మతి, గంగా నదులు ప్రక్షాళన చేస్తున్నప్పుడు.. మూసీ ప్రక్షాళన ఎందుకు చేయకూడదు?. మూసీ ప్రాంతంలో ప్రజల కష్టాలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా?. నల్గొండ జిల్లా రైతులు బాగుపడకూడదనే BRS కుట్ర పన్నుతోంది. SLBCని గత BRS ప్రభుత్వం పట్టించుకోలేదు'. అని ప్రతిపక్ష BRS పార్టీపై విరుచుకుపడ్డారు.

అటు ప్రతిపక్షపార్టీ BRS పైన సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. అది బీఆర్ఎస్ కాదు.. అది DRS(దెయ్యాల రాజ్య సమితి)పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. 'BRSలో దెయ్యాలు ఉన్నాయని కవితే అన్నారు. ఇంటి ఆడబిడ్డే దెయ్యాలు ఉన్నాయి అంటే నోరు విప్పని పరిస్థితి.. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటేవరకు తరిమికొట్టాలి.. పదేళ్లపాటు తెలంగాణను దోచుకుతిన్నారు. బంగారు తెలంగాణ ముసుగులో బొందలగడ్డ చేశారు. తెలంగాణను బొందలగడ్డ చేసిన ప్రతి వెధవ మాట్లాడుతున్నాడు. తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలో పడేశారు. పదేళ్లు దోచుకుతిన్న మీరా.. నన్ను ప్రశ్నించేది?. యాదగిరిగుట్టలో అపచారం వల్లే గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంది. గతంలో చేసిన పాపాల వల్లే కిందపడి మక్కెలు ఇరగ్గొట్టుకున్నారు. వాసాలమర్రిని ఆదర్శ గ్రామం చేస్తామని చెప్పి ఇళ్లు కూల్చేశారు. ఎర్రవల్లికి రోడ్డు వేసుకునేందుకే వాసాలమర్రిని కూల్చేశారు' అని రేవంత్‌ విపక్ష బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు.


ఇవీ చదవండి:

సెకెండ్ హ్యాండ్ కారు కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఐఫోన్, మ్యాక్‌బుక్ రిపేర్ బాధ్యతలు నిర్వహించనున్న టాటా

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 06 , 2025 | 09:08 PM