16వేల మెగావాట్లు దాటిన విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Feb 20 , 2025 | 05:24 AM
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. బుధవారం ఉదయం 7:55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16,058 మెగావాట్లుగా నమోదైంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే అత్యధికం
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. బుధవారం ఉదయం 7:55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16,058 మెగావాట్లుగా నమోదైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇదే అత్యధిక డిమాండ్ కావడం గమనార్హం. ఈనెల 10వ తేదీన 15,998 మెగావాట్ల డిమాండ్ నెలకొనగా... తొమ్మిది రోజుల్లోనే ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి సీజన్ నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, దీనికితోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గృహ, వాణిజ్య వినియోగం భారీగా పెరగడం వల్లే అత్యధిక డిమాండ్ ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ను అందించాలని, సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచించారు.