Share News

Gachibowli: బెట్టింగ్‌లో రూ.2.5 లక్షలు పోగొట్టి.. నిలదీసిన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు!

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:44 AM

ఇంట్లో దాచిన డబ్బును పెద్దవాళ్లకు తెలియకుండా ఆన్‌లైన్‌ జూదంలో పెట్టి కోల్పోయిన యువకుడు, ఆ డబ్బు గురించి మందలించాడని పగ పెంచుకొని కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపాడు.

Gachibowli: బెట్టింగ్‌లో రూ.2.5 లక్షలు పోగొట్టి.. నిలదీసిన తండ్రిని కత్తితో పొడిచి చంపాడు!

  • కుమారుడి దుర్మార్గం.. గచ్చిబౌలిలో ఘటన

రాయదుర్గం,జూలై2(ఆంధ్రజ్యోతి): ఇంట్లో దాచిన డబ్బును పెద్దవాళ్లకు తెలియకుండా ఆన్‌లైన్‌ జూదంలో పెట్టి కోల్పోయిన యువకుడు, ఆ డబ్బు గురించి మందలించాడని పగ పెంచుకొని కన్నతండ్రిని కత్తితో పొడిచి చంపాడు. పైగా తానే పొడుచుకొని చనిపోయాడని అందర్నీ నమ్మించేందుకు విఫలయత్నం చేశాడు! గచ్చిబౌలిలో ఈ ఘటన జరిగింది. సీఐ హబీబ్‌బుల్లాఖాన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... గోపన్‌పల్లి ఎన్టీఆర్‌ నగర్‌లో హన్మంతు నాయక్‌ కుటుంబం నివసిస్తోంది. ఇటీవల వనపర్తిలోని స్థలాన్ని విక్రయించగా వచ్చిన రూ.6 లక్షలను హన్మంతు ఇంట్లో దాచాడు. ఇది గమనించిన హన్మంతు కుమారుడు రవీందర్‌ నాయక్‌, ఆ డబ్బులోంచి రూ.2.5 లక్షలు తీసుకొని ఆన్‌లైన్‌ జూదంలో పెట్టి పోగొట్టాడు. ఆ డబ్బు గురించి హన్మంతు నిలదీస్తే అవసరానికి ఓ స్నేహితుడు అడిగితే ఇచ్చానని, తొందర్లోనే తెచ్చి ఇస్తానని చెబుతూ వస్తున్నాడు.


ఈ డబ్బుల విషయం గుర్తొచ్చినప్పుడల్లా హన్మంతు మందలిస్తుండటంతో తండ్రిపై రవీందర్‌ కోపం పెంచుకున్నాడు. తండ్రిని చంపాలని పథకం వేసుకున్నాడు. అప్పు తీసుకున్న తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తానన్నాడని తండ్రిని నమ్మించిన రవీందర్‌ అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ.. వెంట తెచ్చుకున్న కత్తితో హన్మంతు గొంతులో పొడిచి చంపాడు. అనంతరం తన మేనమామకు ఫోన్‌ చేసి.. తండ్రి కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. బంధువులు అక్కడికి వెళ్లి చూడగా హన్మంతు రక్తపుమడుగులో చనిపోయి ఉన్నాడు. రవీందర్‌పై అనుమానం వచ్చిన హన్మంతు బావమరిది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీందర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. డబ్బు గురించి నిలదీయడం, మందలించడంతోనే తండ్రిని హత్యచేసినట్లు చెప్పాడు.

Updated Date - Jul 03 , 2025 | 05:44 AM