SFI: ప్రజాసమస్యలపై విద్యార్థులు ఉద్యమించాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:25 AM
విద్యా వ్యవస్థలోని లోపాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటిపైనే కాక ప్రజా సమస్యలపై కూడా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎ్ఫఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ పిలుపునిచ్చారు.

ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ
ఖమ్మంలో ముగిసిన ఎస్ఎ్ఫఐ రాష్ట్ర మహాసభలు
ఎస్ఎ్ఫఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా రజనీకాంత్, నాగరాజు
ఖమ్మం సంక్షేమ విభాగం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థలోని లోపాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి వాటిపైనే కాక ప్రజా సమస్యలపై కూడా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎ్ఫఐ జాతీయ ఉపాధ్యక్షుడు నితీష్ నారాయణ పిలుపునిచ్చారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎస్ఎ్ఫఐ ఐదో మహాసభలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ ముగింపు సభకు హాజరైన నితీష్ నారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ హిందుత్వ అజెండాను విద్యార్థులు, యువత అడ్డుకోవాలని కోరారు. సామాజిక సమస్యలపై విద్యార్థులు ఉద్యమ కార్యచరణ చేపట్టాలని సూచించారు.
గుజరాత్లో అంగన్వాడీ కేంద్రాలను జనాభా ప్రాతిపదికన కాకుండా కులాల ప్రాతిపదికన ఏర్పాటు చేయడంపై అక్కడి ఎస్ఎ్ఫఐ పోరాటం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. కాగా, నూతన విద్యా విధానం రద్దు, విద్యార్థి సంఘాలు ఎన్నికల నిర్వహణ, గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మాణం సహా 17 అంశాలపై చేసిన తీర్మానాలను మహాసభల్లో ఆమోదించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్ఎ్ఫఐ విద్యార్థుల నివేదిక సమర్పణ సందర్భంగా సభ మారుమోగింది. ముగింపుసభలో కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు మాట్లాడారు. కాగా, మహాసభల ముగింపు సందర్భంగా ఎస్ఎ్ఫఐ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్ఎ్ఫఐ రాష్ట్ర అధ్యక్షుడిగా రజనీకాంత్(కరీంనగర్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్ల నాగరాజు ఎన్నికయ్యారు. వీరితో పాటుగా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.