Saraswathi Pushkaralu: 15 నుంచి సరస్వతి పుష్కరాలు
ABN , Publish Date - May 07 , 2025 | 04:30 AM
ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు సమీక్షించారు. సీఎం రేవంత్రెడ్డికి మంత్రి సురేఖ స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు.

ఏర్పాట్లపై మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు సమీక్ష
సీఎం రేవంత్రెడ్డికి మంత్రి సురేఖ ఆహ్వానం
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ‘అంతర్వాహిని’గా ప్రవహించే సరస్వతి నది పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే పుష్కరాలపై మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14 రాత్రి 10.35 గంటలకు మిధున రాశిలోకి బృహస్పతి ప్రవేశించడంతో పుష్కర కాలం ప్రారంభమవుతున్నందున.. అప్పటికే ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15 ఉదయం నుంచి నుంచి 12 రోజుల వరకూ భక్తులు పుణ్య స్నానాలు చేస్తారని సురేఖ, శ్రీధర్బాబు చెప్పారు. భక్తులకు పుష్కర ఏర్పాట్ల సమగ్ర సమాచారం తెలిపేందుకు ప్రారంభించి సరస్వతి పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్ల్లో పూర్తి వివరాలు అందజేయాలని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి తగినట్లు రాష్ట్రంలోని కీలక ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు కొండా సురేఖ, శ్రీధర్బాబు సూచించారు.
ఈ నెల 15, 16 తేదీల్లో మెదక్లోని రంగంపేట శ్రీగురుమదనానంద సరస్వతి స్వాములు పుష్కరాలను ప్రారంభిస్తారని తెలిపారు. సరస్వతి పుష్కరాల సమయంలో రోజుకో పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 15న ప్రారంభమయ్యే సరస్వతి నది పుష్కరాలకు రావాలని సీఎం రేవంత్రెడ్డిని మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. జుబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు. అక్కడే ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్లకూ ఆహ్వాన పత్రికలు అందించారు.