Share News

Rythu Bharosa: ఎన్నికల ‘భరోసా’!

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:03 AM

అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం మరో 10-15 రోజుల్లోనే అందే అవకాశం కనిపిస్తోంది. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం...

Rythu Bharosa: ఎన్నికల ‘భరోసా’!
Rythu Bharosa

  • 10-15 రోజుల్లో రైతులకు పెట్టుబడి సాయం

  • స్థానిక ఎన్నికలకు ముందే పంపిణీకి కసరత్తు

  • నిధుల సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం

  • 4వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐకి ఇండెంట్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం మరో 10-15 రోజుల్లోనే అందే అవకాశం కనిపిస్తోంది. జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆలోపే రైతు భరోసా పంపిణీని పూర్తి చేయాలని భావిస్తోంది. రైతుల ఖాతాల్లో వానాకాలం రైతు భరోసా జమచేసిన తర్వాతే స్థానిక ఎన్నికల నగారా మోగించనుంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపై దృష్టి సారించింది. ఇటీవల రిజర్వుబ్యాంకు నుంచి రూ. 3 వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో రూ.4వేల కోట్లకు శుక్రవారం ఇండెంటు పెట్టింది. ఈ నిధులన్నీ సమకూరాక రైతులకు వానాకాలం పెట్టుబడి సాయాన్ని అందించనుంది.


1.30 కోట్ల ఎకరాల్లోనే సాగు..

రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉన్నట్లుగా రికార్డుల్లో ఉంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేయగా... ప్రతి సీజన్‌కు సుమారుగా రూ.7,500 కోట్లు అవసరమయ్యేవి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం గత యాసంగి(2024- 25) సీజన్‌లో పథకం పేరును రైతు భరోసాగా మార్చి, 2023- 24 యాసంగి సీజన్‌లో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు పంపిణీ చేసింది. రైతు బంధును ప్రక్షాళన చేసి కొత్త మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పడుతుందంటూ (2024- 25) వానాకాలం సీజన్‌లో రైతు భరోసా ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్నటి యాసంగి సీజన్‌లో 57లక్షల మంది రైతులకు చెందిన 84 లక్షల ఎకరాలకు రూ. 5,058 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందించింది. ఇక, ప్రస్తుత వానాకాలం సీజన్‌లో మొత్తం విస్తీర్ణానికి రైతు భరోసా ఇస్తారా? అప్పటి లాగే పెద్ద రైతులను మినహాయించి చిన్న, సన్నకారు రైతులకే పరిమితం చేస్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్‌లో 1.30కోట్ల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తుంటారు. మరో 20 లక్షల ఎకరాలు వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ... సాగుకు యోగ్యంగా లేవు. దీంతో ఈ 20 లక్షల ఎకరాలను రైతు భరోసా నుంచి మినహాయించే అవకాశాలున్నాయి. 1.30లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తే.. రూ.7,800 కోట్లు అవసరమవుతాయి. గత యాసంగి సీజన్‌ మాదిరిగా చిన్న, సన్నకారు రైతులకే భరోసాను పరిమితం చేస్తే.. రూ.6-7వేల కోట్లు సరిపోయే అవకాశం ఉంది. ఈ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధుల సమీకరణలో నిమగ్నమైంది. ఈ నెల 10వ తేదీన ఆర్‌బీఐ నుంచి రూ.3వేల కోట్ల అప్పు తీసుకున్న సర్కారు.. తాజాగా శుక్రవారం మరో రూ.4 వేల కోట్ల రుణం కోసం ఇండెంటు పెట్టింది. ఈ సొమ్ము 17వ తేదీ నాటికి ఖజానాకు చేరనుంది. ఈ నిధులతోనే రైతుభరోసా అమలుచేయాలనే ఆలోచనలోప్రభుత్వం ఉంది.


రైతు భరోసా తర్వాతే స్థానిక సమరం

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత... 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినా.. లోక్‌సభ ఎన్నికల కారణంగా సాధ్యం కాలేదు. ఆ తర్వాత కులగణన చేపట్టాలని, జనాభాలో ఎవరి వాటా ఎంతో తేలిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆలస్యమైంది. ఎట్టకేలకు వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ లోపే ఒక కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనతో ఉంది. వానాకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో వేశాక, ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని రేవంత్‌ సర్కారు భావిస్తున్నట్లు తెలిసింది.


క్యాబినెట్‌ భేటీలో తుది నిర్ణయం

ఈ నెల నాలుగో వారంలో నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రైతు భరోసాపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెలాఖరులో జారీ చేయాలా? జూలైలో ఎన్నికలు నిర్వహిస్తే... ఏ తేదీల్లో నిర్వహించాలి? గ్రామపంచాయతీ ఎన్నికలు, ప్రాదేశిక (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలు ఒకే నెలలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది? లేకపోతే కొంత వ్యవధి ఇస్తే ఎలా ఉంటుంది? అనే అంశాలు చర్చకు రానున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడేలోపే రైతుభరోసా సాయాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో స్పష్టమైన తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండి..

విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్‌లో ఎస్కేప్.. సుడి బాగుంది!

గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 14 , 2025 | 07:41 AM