Share News

RTC Strike Delay: సమ్మె వాయిదా

ABN , Publish Date - May 07 , 2025 | 03:24 AM

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నంతో జరిగిన చర్చలు విజయవంతమవడంతో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. జూన్‌ 2లోగా సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనలు చేపడతామని జేఏసీ హెచ్చరించింది.

RTC Strike Delay: సమ్మె వాయిదా

  • మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం

  • సమస్యలపై మంత్రి సానుకూల స్పందన

  • 2019 సమ్మె నాటి కేసుల ఎత్తివేతకు..

  • పోలీసులకు ఆదేశాలిస్తామన్నారు: జేఏసీ

  • ఆర్టీసీ సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • జూన్‌ 2లోగా పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనలు: అశ్వత్థామరెడ్డి

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు మొత్తం 21 సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ జేఏసీ బుధవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే సమ్మె వద్దని, చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తికి జేఏసీ స్పందించింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో ఆర్టీసీ జేఏసీ నేతలు మంత్రి పొన్నంతో సచివాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ కోదండరాం తదితరుల సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. మంత్రితో చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అయితే సమస్యల పరిష్కారానికి కొంత సమయం అవసరమవుతుందని, సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. సింగరేణి కాలరీస్‌ తరహాలో ఆర్టీసీ కార్మికులకు రెగ్యులర్‌ టైమ్‌ స్కేల్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారని పేర్కొన్నారు. విద్యుత్తు బస్సుల్ని ఆర్టీసీకి సబ్సిడీపై నేరుగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి నోట్‌ పంపించారని తెలిపారు. దీంతోపాటు 2019 సమ్మె కాలంలో నమోదు చేసిన కేసుల ఎత్తివేతకు పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని జేఏసీ నేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రిపై, మంత్రిపై నమ్మకం ఉంచి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. హామీ మేరకు సమస్యల్ని పరిష్కరించకపోతే మరోసారి సమ్మెకు వెళ్తామని మంత్రికి స్పష్టం చేశామని తెలిపారు.


సీఎంతో మాట్లాడి సమస్యల పరిష్కారం..

ఆర్టీసీ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జేఏసీ నేతలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పరిస్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు చేపట్టామని, ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి తదితరులు చొరవ తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీలో నెలకొన్న సమస్యల్ని జూన్‌ 2వ తేదీలోగా పరిష్కరించకపోతే దశలవారీగా ఆందోళనలు చేపడతామని టీఎంయూ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. అన్ని సంఘాలు, కార్మికుల మద్దతు కూడగట్టి సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపడతామన్నారు. అవసరమైతే సమ్మె చేపట్టేందుకు వెనకాడబోమన్నారు. ప్రస్తుత జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ఏం సాధించిందని ప్రశ్నించారు.

Updated Date - May 07 , 2025 | 03:26 AM