Share News

CM Revanth Reddy: లోటుపాట్లు సరిదిద్దుకోండి

ABN , Publish Date - May 21 , 2025 | 03:33 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరచాలని, ప్రజలకు చేరువ కావాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వ్యవహరించాలని, సంక్షేమ పథకాల్లో లోటుపాట్లు సరిదిద్దాలని సూచించారు.

CM Revanth Reddy: లోటుపాట్లు సరిదిద్దుకోండి

  • నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉండండి

  • ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకోండి

  • స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయండి

  • నాగర్‌ కర్నూల్‌, మల్కాజ్‌గిరి, మెదక్‌ పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు రేవంత్‌ దిశానిర్దేశం

  • పనితీరు నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం ముఖాముఖి

  • లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లోటుపాట్లను సరిదిద్దుకోవాలని, ప్రజలకు మరింత చేరువ కావాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం తదితర సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. పథకాల అమల్లో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని, పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. కొద్దిరోజుల కిందట జరిగిన సీఎల్సీ సమావేశంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో తాను ముఖాముఖిగా భేటీ అవుతానని, ఈలోగా తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల జాబితాను రూపొందించుకోవాలని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో సమావేశమై.. వారికి దిశానిర్దేశం చేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌, మెదక్‌, మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమాశంలో ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనంపల్లి రోహిత్‌, శ్రీగణేశ్‌ పాల్గొన్నారు.


హామీలు.. సూచనలు..

ఒక్కో ఎమ్మెల్యేకు 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడిన ముఖ్యమంత్రి.. ముందుగా నియోజకవర్గ సమస్యలపై వారు చెప్పాల్సింది చెప్పాలని సూచించారు. దీంతో క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఆయా నియోజకవర్గాల్లో తక్షణం పూర్తి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యేలు వివరించారు. ఆపై.. ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన సీఎం.. సంబంధిత ప్రతిపాదనలను అధికారులకు అందజేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా తగిన సూచనలూ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల అనుచరులు, సిబ్బంది వల్ల ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి వాటిని సరిదిద్దు కోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువ కావాలని, పథకాలను వారి వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. ఎమ్మెల్యేల పనితీరు సహా లోటుపాట్లను సమగ్రంగా వివరించి వాటిని సరిదుద్దుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత తనదని చెప్పారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నల్లమల డిక్లరేషన్‌ను అమలు చేసే పూచీ తనదని నాగర్‌ కర్నూల్‌ పరిధిలోని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు.

Updated Date - May 21 , 2025 | 03:33 AM