Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన
ABN , Publish Date - May 16 , 2025 | 11:03 AM
Timmapur Railway Station: ఓ కార్మికుడు తన పనిని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.

రంగారెడ్డి, మే 16: అదృష్టం కలిసి వస్తే ఎంత పెద్ద ప్రమాదం నుంచి అయినా తప్పించుకుంటారు కొందరు. లేకపోతే చిన్న ప్రమాదాలకే ప్రాణాలు కోల్పోతుంటారు. పెద్ద పెద్ద ఆక్సిడెంట్ల నుంచి ఎలాంటి దెబ్బలు తగలకుండా కొంతమంది ప్రాణాలతో బయటపడతారు. వీరిని చూసే అంటారేమో వీళ్లకు భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి అని. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో (Rangareddy) చోటు చేసుకుంది. ఓ కార్మికుడు తన పనిని ముగించుకుని ఇంటి బాట పట్టాడు. ఈ క్రమంలో అతడు రైలు పట్టాలు దాటాల్సి వచ్చింది. కానీ ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో ఓ కార్మికుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలు దాటుతున్నాడు. అయితే అక్కడున్న గూడ్స్ ట్రైన్ అకస్మాత్తుగా ముందుకు కదలడంతో ఆ కార్మికుడు రైలు పట్టాలపై పడుకున్నాడు. గూడ్స్ ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు.
నిన్న (గురువారం) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తిమ్మాపూర్ ఒక పారిశ్రామిక వాడ. తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ చుట్టూ అనేక పరిశ్రమలు ఉంటాయి. ఒక సైడ్ రెసిడెన్షియల్ క్వాటర్స్ ఉండగా, మరో పక్క పరిశ్రమలు ఉంటాయి. తరచుగా అటూ ఇటూ వెళ్లేవాళ్లంతా పుట్ఓవర్ బ్రిడ్జ్ను ఉపయోగించకుండా కింద నుంచే వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన ఓ కార్మికుడు ఆగి ఉన్న గూడ్స్ రైలు ముందు నుంచి వెళ్తున్నాడు. అయితే అకస్మాత్తుగా గూడ్స్ రైలు కదిలింది. ఈ సమయంలో ఏం చేయాలో తెలియక ఓ క్షణం భయాందోళనకు గురయ్యాడు. మళ్లీ అంతలోనే ప్రాణాలు దక్కించుకునేందుకు ట్రాక్ మధ్యలో పడుకుండిపోయాడు. మొత్తం గూడ్స్ రైలు వెళ్లిన తర్వాతే సదరు కార్మికుడు లేవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇలాంటి ఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
AP Revenue Comparison: సంపదపై శోకాలు
Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
Read Latest Telangana News And Telugu News