Phone Tapping: మళ్లీ ప్రణీత్రావును ప్రశ్నించిన సిట్
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:46 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును సిట్ అధికారులు మరోసారి విచారించారు. ఈ కేసులో అరెస్టయి, బెయిల్ మీదున్న ఆయన్ను శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ప్రభాకర్రావు చెబితేనే డేటాను ధ్వంసం చేసినట్లు గతంలో వాంగ్మూలం
నేడు ప్రభాకర్రావు విచారణ
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును సిట్ అధికారులు మరోసారి విచారించారు. ఈ కేసులో అరెస్టయి, బెయిల్ మీదున్న ఆయన్ను శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇదే కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు శనివారం విచారణకు హాజరవుతున్న క్రమంలో ప్రణీత్రావును మరోసారి ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావు కీలకపాత్ర పోషించినట్లు ఇప్పటికే సిట్ అధికారులు చార్జిషీటులో పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్గా ఎస్ఐబీలోకి ప్రవేశించిన ప్రణీత్రావు ఆ తర్వాత యాక్సిలరేటరీ పదోన్నతి పొంది డీఎస్పీ అయ్యారు. ప్రణీత్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఫోన్ ట్యాపింగ్లో కీలకపాత్ర పోషించింది. ఎస్ఐబీలో ప్రణీత్రావు బృందానికి ప్రత్యేకంగా రెండు గదులున్నాయని.. వాటిలో అధునాతన కంప్యూటర్లు, ట్యాపింగ్ పరికరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేశారని సమాచారం. ఇదే సెట్పను తర్వాత మీడియా బాస్ శ్రవణ్రావు ఇంట్లోనూ ప్రణీత్రావు ఏర్పాటు చేశారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే 2023 డిసెంబరు 4న రాత్రి ప్రణీత్రావు ఎస్ఐబీ ఆఫీసులోకి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేశారు. దాదాపు రెండు టీబీల డేటాను నాశనం చేయడమేగాక 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి, తీసుకెళ్లి మూసీలో పడేసినట్లు ప్రణీత్రావు గత విచారణలో అంగీకరించారు. ప్రభాకర్రావు చెబితేనే డేటాను ధ్వంసం చేశానని వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ వాంగ్మూలాన్ని ప్రభాకర్రావు వ్యతిరేకిస్తున్న క్రమంలో డేటా విధ్వంసం జరిగితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారం ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలపై ప్రభాకర్రావును ఇటీవల సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారనే కోణంలో ప్రణీత్రావు చెప్పే విషయాలను బట్టి ప్రభాకర్రావును విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్పై ప్రభాకర్రావు పెదవి విప్పుతారా? లేదా? అన్నది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్రావును సాంకేతిక ఆధారాలతో ప్రశ్నించాలని సిట్ అధికారులు ప్రయత్నిస్తున్న క్రమంలో తదుపరి విచారణపై రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. 10 నిమిషాల గ్యాప్లో ఎస్కేప్.. సుడి బాగుంది!
గుబులు పుట్టించిన మరో ఎయిరిండియా ఫ్లైట్.. 3 గంటలు గాల్లోనే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి