Ponnam Prabhakar: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:51 AM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ‘నగదు రహిత చికిత్స పథకం-2025’ ఎంతో ఉపయోగకరంగా ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకంపై నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు: పొన్నం
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ‘నగదు రహిత చికిత్స పథకం-2025’ ఎంతో ఉపయోగకరంగా ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం’ అమలుపై రవాణా, పోలీస్, ఆరోగ్య, బీమా తదితర విభాగాలతో సచివాలయంలో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి, ఇతర విభాగాల వారికి, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ పథకం విజయవంతం అయ్యేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసులకు సమాచారం ఇస్తే.. తమ మీద కేసులు అవుతాయనే భయం ప్రజల్లో ఉందని, అది కేవలం అపోహ మాత్రమేనని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.