Share News

జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారు?

ABN , Publish Date - Jun 12 , 2025 | 02:50 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు రెండో రోజున సిట్‌ అధికారుల ముందు హజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్‌ కార్యాలయానికి వచ్చి ఆయన.. విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు.

జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్‌ చేశారు?

  • ఆదేశాలిచ్చిందెవరు? మీ పరిధిని దాటి ఎందుకు వెళ్లారు?

  • ట్యాపింగ్‌లో ప్రైవేటు వ్యక్తుల్ని ఎందుకు ఉపయోగించారు?

  • రివ్యూ కమిటీకి ట్యాపింగ్‌ సమాచారం ఎందుకివ్వలేదు?

  • ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నది ఎవరు?

  • రెండో రోజున 8 గంటలపాటు ప్రభాకర్‌రావు విచారణ

  • ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ వెలికితీసిన సమాచారంతో సిట్‌ ప్రశ్నలు

  • ఆయన 2 ఫోన్లు స్వాధీనం.. 14న మరోసారి రావాలని ఆదేశం?

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు రెండో రోజున సిట్‌ అధికారుల ముందు హజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిట్‌ కార్యాలయానికి వచ్చి ఆయన.. విచారణ ముగిసిన తర్వాత రాత్రి 8గంటల ప్రాంతంలో తిరిగివెళ్లారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు ప్రశ్నించారు. తదుపరి విచారణ నిమిత్తం 14న మరోసారి హాజరు కావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌ జరుగుతుంటుంది.. కానీ, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను ఎందుకు ట్యాప్‌ చేయించారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు? అని ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తొలి రోజు విచారణలో ప్రభాకర్‌ రావు నుంచి ఆశించిన సమాచారం రాకపోవడ ంతో బుధవారం విచారణలో సిట్‌ అధికారులు మరో వ్యూహంతో ముందుకెళ్లినట్టు.. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ డేటా ఆధారంగా ఆయన్ను ప్రశ్నించినట్టు సమాచారం.


ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహరం బయటపడిన తర్వాత అరెస్టు అయిన పోలీసు అధికారులు తిరుపతన్న, ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు నుంచి సెల్‌ఫోన్లు, కొన్ని హర్డ్‌డి్‌స్కలను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు పొక్కడంతో ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులంతా తమ ఫోన్లు, పర్సనల్‌ ల్యాప్‌టా్‌పలు, హర్డ్‌డి్‌స్కల్లోని సమాచారాన్ని డిలీట్‌ చేశారు. దీంతో సిట్‌ అధికారులు వీరు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, హర్డ్‌ డిస్క్‌లను డేటా రికవరీ కోసం ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎఫ్‌ఎ్‌సఎల్‌)కు పంపారు. ఎఫ్‌ఎ్‌సఎల్‌ అధికారులు.. వాటిలో డిలీట్‌ చేసిన సమాచారాన్ని చాలావరకు రిట్రీవ్‌ చేసి సిట్‌కు అందించారు. ఆ డేటా ఆధారంగానే ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి ప్రశ్నించడంతో ఆయన మౌనం వహించినట్టు తెలుస్తోంది. కాగా.. నిబంధనల ప్రకారం మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరచాల్సి ఉన్నప్పటికీ, రాజకీయ నాయకుల ఆదేశాలతోనే ఆ డేటాను ధ్వంసం చేయాల్సి వచ్చిందని, అది స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌కు విరుద్ధంగా జరిగిందని ప్రభాకర్‌ రావు ఒప్పుకొన్నట్టు సమాచారం. అలాగే.. గతంలో సిట్‌ అధికారులు కోరిన మేరకు తన రెండు సెల్‌ఫోన్లను ఆయన వారికి స్వాధీనం చేశారు.


విచారణ వీడియో తీయడంపై అసహనం..

విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ ఎస్‌ఐబీలో అంతర్గత బాధ్యత అయినప్పటికి మీరు ప్రత్యేకంగా స్పెషల్‌ ఆపరేషన్‌ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు? దీనికి ప్రభుత్వ అనుమతి ఉందా? అనధికారికంగా మీ అంతట మీరే ఏర్పాటు చేయించారా?’’ అని సిట్‌ అధికారులు ప్రశ్నించగా.. తాను విధి నిర్వహణలో భాగంగానే పనిచేశానని పలుమార్లు ప్రభాకర్‌రావు బదులిచ్చారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి.. ప్రైవేట్‌ వ్యక్తి అయిన శ్రవణ్‌రావు మీ బృందంలో ఎలా సభ్యుడయ్యాడు? అతణ్ని ఇందులోకి ఎవరి ద్వారా తీసుకొచ్చారు?’’ అని ప్రశ్నిస్తూ.. ప్రణీత్‌రావు, తిరుపతన్న ఫోన్ల నుంచి రిట్రీవ్‌ చేసిన కొన్ని వాట్సాప్‌ సంభాషణల కాపీలను సిట్‌ అధికారులు ప్రభాకర్‌రావు ముందుంచినట్లు తెలుస్తోంది. అలాగే.. ‘‘ఏదైనా ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయాల్సి వస్తే ఏడు రోజుల తర్వాత రివ్యూ కమిటీకి ఆ విషయాన్ని రాతపూర్వకంగా మీరు తెలియచేయాలి కదా ఇన్ని వేల నెంబర్లను ట్యాపింగ్‌ చేసినా ఆ వివరాలు రివ్యూ కమిటీకి ఎందుకు తెలియచేయలేదు? మీపై ఉన్నతాధికారులున్నారు.. వారికన్నీ తెలుసు అంటున్నారు కదా.. నాటి హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తాను మీరు బేఖాతర్‌ చేశారా? లేక ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారా?’’ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


ప్రభాకర్‌రావు మోసపూరితంగా వ్యవహరించారని రవిగుప్తా హైకోర్టులో వేసిన అఫిడవిట్‌ను గుర్తు చేస్తూ ‘‘ఆయన మీ గురించి అలా ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే మీరు ఒక సమాచారం ఇచ్చి మరో పని అనధికారికంగా చేశారా?’’ అని ప్రశ్నించినపుడు ప్రభాకర్‌రావు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. ‘‘నిఘా సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు కదా.. మరి మీరు ప్రైవేటు వ్యక్తిని ఇందులో భాగస్వామిని చేయడంతో పాటు ఆయనకు కొంత సమాచారాన్ని ఇచ్చినట్లు నిర్ధారణ అయ్యింది’’ అంటూ కొన్ని సంభాషణల స్ర్కీన్‌షాట్స్‌ను ప్రభాకర్‌రావుకు అధికారులు చూపించినట్లు తెలుస్తోంది. ఇలా వారు ఆధారాలతో ప్రశ్నలు అడుగుతుండడంతో.. ప్రభాకర్‌రావు చాలా ప్రశ్నలకు గుర్తులేదు అని చెబుతూ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నారని.. మరికొన్ని ప్రశ్నలకు ‘మీవద్ద ఆధారాలుంటే చూపండి’ అంటూ ఎదురు ప్రశ్నలు వేశారని సమాచారం. కాగా.. విచారణ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్‌ చేయడం పట్ల ప్రభాకర్‌రావు కొంత అసహనానికి గురైనట్లు తెలిసింది. ప్రభాకర్‌రావు బెయిల్‌ పిటీషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటం ఆగస్టు 5వ తేదిన జరిగే తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు మధ్యంతర ఉపశమనం ఇవ్వడంతో ప్రభాకర్‌రావు విచారణలో ఏమాత్రం భయపడకుండా నిబ్బరంగా ఉన్నారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 02:50 AM