Vikarabad Incident: పేరెంట్స్ మీటింగ్ రోజే అన్నంలో పురుగులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:36 AM
పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పిల్లలకు రోజూ ఇలాంటి భోజనమే పెడుతున్నారా.. అంటూ సిబ్బందిపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
వికారాబాద్ జిల్లా సిరిపురం ఎస్సీ బాలుర హాస్టల్లో ఘటన
మర్పల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు రోజూ ఇలాంటి భోజనమే పెడుతున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగింది. ఆదివారం వసతి గృహ వార్డెన్ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. వసతి గృహంలో అన్ని వసతులు ఉన్నాయని, పిల్లలు బాగా చదువుతున్నారని చెప్పి సమావేశాన్ని ముగించారు.
మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు సిబ్బంది భోజనం వడ్డిస్తుండగా కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాత్రలో ఉన్న అన్నాన్ని పరిశీలించారు. పురుగులు కనిపించడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. విద్యార్థులకు ఈ విధమైన భోజనాన్ని వడ్డిస్తారా అంటూ వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహంలో తాము ఉండగానే ఇలాంటి భోజనం వడ్డిస్తున్నారంటే తమ పిల్లలకు ప్రతిరోజూ ఏ విధమైన భోజనం అందిస్తున్నారో అర్థమవుతోందని మండిపడ్డారు. జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణా లోపంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించారు.