P V Narasimha Rao: ఢిల్లీ తెలంగాణ భవన్లో పీవీ విగ్రహం?
ABN , Publish Date - May 13 , 2025 | 04:49 AM
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది.

న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపాదన..
ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం!
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని తెలంగాణ భవన్లో దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు మార్గం సుగమమైనట్టు తెలిసింది. పీవీ విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రతిపాదన చేయగా.. ఇటీవల జరిగిన సమావేశంలో ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. తెలంగాణ భవన్లోని ప్రతిపాదిత స్థలంలో ఏర్పాట్లపై పలు సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కలిపి ఒకే అధికారిక భవన సముదాయం ఉంది. ఈ ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం పక్కనే.. పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని.. దానికి స్థలం ఇవ్వాలని కోరుతూ పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ 2024 ఏప్రిల్లో ఎన్డీఎంసీకి లేఖ రాసింది. ఎన్డీఎంసీ ఆ ప్రతిపాదనను ఢిల్లీ అర్బన్ ఆర్ ్ట కమిషన్కు పంపింది. దీనిపై మార్చి 27న ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సమావేశం మినిట్స్ను పరిశీలిస్తే.. ‘తెలంగాణ భవన్లో పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఎంసీ పంపిన ప్రతిపాదన ఆమోదించబడింది. ప్రతిపాదిత స్థలాన్ని సిద్ధం చేయాలి. రాత్రిపూట ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నట్టు వెల్లడించాయి. నిజానికి ఢిల్లీలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, టాల్కటోరా రోడ్డుకు ఆయన పేరు పెట్టాలని కోరుతూ.. పీవీ కుటుంబ సభ్యులు 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్కు లేఖ రాశారు. కానీ ముందుకు సాగలేదు. కేసీఆర్ సర్కారు హయాంలోనూ తెలంగాణ భవన్లో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు లేఖ రాశారు. అయినా అమల్లోకి రాలేదు. ఇప్పుడు ముందడుగు పడింది. ఢిల్లీలోని అశోకా రోడ్డులో తెలంగాణ భవన్ నూతన భవనానికి స్థల పరిశీలన, నమూనాల ఖరారు పూర్తయ్యాయి. ఈ క్రమంలో పాత భవనంలో పీవీ విగ్రహ ఏర్పాటు ఏమిటనే ప్రశ్న వస్తోంది. నూతన భవన నిర్మాణ పనుల్లో భాగంగానే పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాస్తామని తెలిపారు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదని తెలంగాణ భవన్ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News