Asaduddin Owaisi: ఇస్లాం పేరిట పాక్ మారణహోమం
ABN , Publish Date - May 11 , 2025 | 04:45 AM
ఇస్లాం శాంతి, సామరస్యానికి ప్రతిరూపం అని, పాకిస్థాన్ మాత్రం ఇస్లాం పేరుతో మారణహోమం సృష్టిస్తోందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.

ఆ దేశానికి ఇస్లాం పేరు పలికే అర్హత లేదు
భారత భూమి కోసం ప్రాణాలర్పిస్తాం
మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్/బర్కత్పుర, మే 10 (ఆంధ్రజ్యోతి): ఇస్లాం శాంతి, సామరస్యానికి ప్రతిరూపం అని, పాకిస్థాన్ మాత్రం ఇస్లాం పేరుతో మారణహోమం సృష్టిస్తోందని, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని, అమాయకుల్ని చంపే పాకిస్థాన్కు.. ఇస్లాం పేరు పలికే అర్హత లేదన్నారు. అమాయకుల్ని, చిన్న పిల్లలను చంపాలని ఇస్లాం చెప్పలేదని పేర్కొన్నారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందని, మారణహోమం సృష్టిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్యర్యంలో శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటైన ఉర్దూ జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవంలో ఒవైసీ మాట్లాడారు. పాకిస్థాన్ విధానాలను తాము ఎప్పుడో తిరస్కరించామని పేర్కొన్నారు. పాకిస్థాన్ దాడులు చేస్తే అంతకుమించి భారత్ దాడి చేస్తుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని.. ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామని చెప్పారు. పాకిస్థాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భారతదేశం నుంచి విడిపోయిన తరువాత పాకిస్థాన్.. ఇక్కడి హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసిందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు అతికిరాతకంగా అమాయకులను హతమార్చారని, దీనికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్తో భారత సైనికులు సరైన సమాధానం ఇస్తున్నారన్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఆర్మీ భారత పౌరులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతోందని, దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. భారత్లోని ముస్లింలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, భారత సైనికులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. పాకిస్థాన్కు ఐఎంఎఫ్ ఇస్తున్నది రుణం కాదని, అది మిలిటెంట్ ఫండ్ అని ఆరోపించారు. రుణ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
పాక్ ఉగ్రవాదాన్ని వీడితేనే శాంతి
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ తన భూభాగాన్ని ఉగ్రవాదం కోసం ఉపయోగించినంత కాలం ఇరు దేశాల మధ్య శాశ్వత శాంతి ఉండదని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. పాక్ దురాక్రమణ చర్యలను నిలిపే వరకు తాను భారత సాయుధ దళాలకు అండగా ఉంటానని ఎక్స్ వేదికగా ఆయన స్పష్టం చేశారు. పాక్ దాడిలో అసువులు బాసిన ఆర్మీ జవాన్ ఎంమురళీ నాయక్, ఏడీడీ రాజ్ కుమార్ థాపాకు నివాళులర్పించారు. కాల్పుల విరమణతో సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాల్పుల విరమణ భారత ప్రధాని ప్రకటించి ఉంటే సమంజసంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.