Share News

Electricity: ఈసారి విద్యుత్‌ చార్జీల పెంపు లేదు

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:15 AM

రాష్ట్రంలో కరెంట్‌ చార్జీలు పెంచితేనే డిస్కమ్‌లు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క రెంట్‌ చార్జీలు పెంచలేమని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ చెప్పారు.

Electricity: ఈసారి విద్యుత్‌ చార్జీల పెంపు లేదు

  • నిజానికి చార్జీలు పెంచితేనే డిస్కమ్‌ల మనుగడ

  • ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెంచడం లేదు

  • వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు పెట్టే.. ఆర్‌డీఎ్‌సఎ్‌సలో చేరడానికి డిస్కమ్‌లు ముందుకొచ్చాయి

  • ఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరెంట్‌ చార్జీలు పెంచితేనే డిస్కమ్‌లు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో క రెంట్‌ చార్జీలు పెంచలేమని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంగళవారం ఈఆర్‌సీ కార్యాలయంలో టారిఫ్‌ ఉత్తర్వులను విడుదల చేశారు. 2025-26లో రూ.65,849.74 కోట్ల ఆదాయం అవసరమని డిస్కమ్‌లు తెలిపాయని, అందులో ప్రధానంగా వ్యవసాయ విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉంటుందని అంచనా వేశాయని వివరించారు. వాస్తవికంగా అన్ని అంశాలను పరిశీలించి రూ.58,628.09 కోట్లకు అనుమతించామని తెలిపారు. 2025-26లో కరెంట్‌ చార్జీల పెంపు లేదని, కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ మే 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో డిమాండ్‌ లేని (నాన్‌ పీక్‌) సమయంలో విద్యుత్‌ ఉంటోందని.. డిమాండ్‌ అధికంగా ఉన్న (పీక్‌) సమయంలో బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. 2025-26లో రూ.13,499 కోట్లను టారిఫ్‌ సబ్సిడీ కింద చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. ఇందులో 29.15 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు కోసం రూ.11,602.60 కోట్లు, గృహ విద్యుత్‌ వినియోగదారులకు సంబంధించి రూ.1,896.81 కోట్లు చెల్లించనుందని వివరించారు.


ఆర్డీఎస్ఎస్‌లో చేరడానికి రాష్ట్ర డిస్కమ్‌లు సిద్ధం

వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు పెట్టడానికి వీలుగా ‘రీవ్యాంప్డ్‌ డిస్ర్టిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం (ఆర్డీఎ్‌సఎ్‌స)’లో చేరడానికి డిస్కమ్‌లు సమ్మతి తెలిపాయని జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ వెల్లడించారు. దీనికోసం కమిటీ కూడా వేసినట్టు తెలిపారు. దీనికి మంత్రివర్గం ఆమోదం వచ్చాక త్రైపాక్షిక ఒప్పందం (తెలంగాణ ప్రభుత్వం, డిస్కమ్‌లు, కేంద్రం) కుదుర్చుకుంటారని వెల్లడించారు. ఓపెన్‌ యాక్సెస్‌ (బహిరంగ విపణి)విధానంలో నేరుగా కరెంట్‌ కొనుగోలు చేసుకునేవారి నుంచి వసూలు చేసే క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జీలను నిర్ధారిస్తూ కూడా ఈఆర్‌సీ ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:15 AM