Share News

Admissions: పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా

ABN , Publish Date - May 30 , 2025 | 03:45 AM

రాష్ట్ర వ్యాప్తంగా పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్‌ తీసుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన దోస్త్‌-2025 తొలి విడత అడ్మిషన్లలో రాష్ట్రంలోని 805 కాలేజీల్లో 74 కాలేజీల్లో ఒక్కరూ అడ్మిషన్‌కు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు.

Admissions: పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు సున్నా

  • ఒక్కరూ చేరని కాలేజీలు 74

  • 60,436 మందికి ప్రవేశాలు ఖరారు

  • 36% మంది కామర్స్‌ కోర్సుల ఎంపిక

  • దోస్త్‌ తొలి విడత జాబితా విడుదల

  • నేటి నుంచి రెండో విడత దరఖాస్తులు

హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పదోవంతు డిగ్రీ కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్‌ తీసుకోలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి ఉద్దేశించిన దోస్త్‌-2025 తొలి విడత అడ్మిషన్లలో రాష్ట్రంలోని 805 కాలేజీల్లో 74 కాలేజీల్లో ఒక్కరూ అడ్మిషన్‌కు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు. అందులో రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఉంది. గతేడాది మాదిరే ఈసారి యూజీ డిగ్రీలో 36శాతం (21,758 మంది) కామర్స్‌ కోర్సులు ఎంచుకోగా, తర్వాతీ స్థానాల్లో ఫిజికల్‌ సైన్సెస్‌ 15,249 మంది, లైఫ్‌ సైన్సెస్‌ 11,005 మంది, ఆర్ట్స్‌ 5,986 మంది, ఇతర కోర్సులు 6,438 మంది ఎంచుకున్నారు. 58,575 మంది ఇంగ్లీష్‌ మాధ్యమం, 1,552 మంది తెలుగు, 309 మంది హిందీ మాధ్యమం ఎంచుకున్నారు. తొలి జాబితాలో సీట్లు విద్యార్థినులే అధికసీట్లు పొందారు. ఈ నెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో 89,572 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా 65,191 మంది వెబ్‌ ఆప్షన్లు సమర్పించారు. వారిలో 60,436 మంది సీట్లు లభించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 805 డిగ్రీ కాలేజీల్లో 3,71,096 సీట్లు ఉన్నాయి. దోస్త్‌ తొలి విడుత అడ్మిషన్ల జాబితాను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు ఈ.పురుషోత్తం, ఎస్‌కె. మహమూద్‌, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్‌ తదితరులు గురువారం విడుదల చేశారు. తొలి జాబితాలో సీట్లు లభించిన వారు ఈ నెల 30 నుంచి జూన్‌ ఆరో తేదీ వరకూ నిర్దిష్ట ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని, లేకపోతే సీటు రద్దవుతుందని బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈ నెల 30 నుంచి జూన్‌ 9వరకూ దోస్త్‌ రెండో విడత దరఖాస్తులను స్వీకరిస్తామని, 13న సీట్లు కేటాయిస్తామన్నారు.


సీట్ల భర్తీలో నిజాం కాలేజీ టాప్‌

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ 1,197 సీట్లకు 1,170 (97.74ు) సీట్ల భర్తీతో మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో కోఠి మహిళా కాలేజీ (వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం)లో 93.19ు, మూడో స్థానంలో ఉన్న సిటీ కాలేజీలో 88.89, బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 82.69, ఖైరతాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 80.98, నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రాం డిగ్రీ కాలేజీలో 80.29, కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ కాలేజీలో 73.01, నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా కాలేజీలో 68.56, హన్మకొండలోని యునివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీలో 66.1, నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీలో 65.75ు సీట్లు భర్తీ అయ్యాయి. ఈసారి దోస్త్‌లో 10 మంది టాప్‌ ర్యాంకర్లలో నలుగురు కోఠి మహిళా కాలేజీని ఎంచుకున్నారు. వారిలో ముగ్గురు ఫిజికల్‌ సైన్సెస్‌, ఒకరు లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ ఆప్ట్‌ చేసుకున్నారు. ఇంటర్‌లో 99.60ు మార్కులతో దోస్త్‌లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు పొందిన వసంత్‌ కుమార్‌, 99.40ు మార్కులతో ఎనిమిదో ర్యాంకు పొందిన బెక్కరి అక్షిత కూడా నిజాం కాలేజీలో కామర్స్‌ విభాగంలో సీటు పొందారు.


75% హాజరుతోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

డిగ్రీ కోర్సుల్లో కనీసం 75% తరగతులకు హాజరైన విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని గురువారం జరిగిన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ల సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మరోవైపు, మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఆరు సెమిస్టర్లలో ప్రతి సెమిస్టర్‌కు 25 క్రెడిట్స్‌ చొప్పున 150 క్రెడిట్స్‌ ఉండగా, వాటిని 142కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. చివరి సంవత్సరం రెండు సెమిస్టర్లలో ఒక మైనర్‌ సబ్జెక్ట్‌, ప్రథమ/ద్వితీయభాషలకు కలిపి 15 చొప్పున 30 క్రెడిట్స్‌ తొలగించారు. ఐదో సెమిస్టర్‌లో మల్టీ డిసిప్లినరీ కోర్సు 4, అదనంగా నేర్చుకునే ఇతర కోర్సులకు 7 క్రెడిట్స్‌, చివరి సెమిస్టర్‌లో ఇంటర్న్‌షి్‌పకు 4, ఇతర అదనపు కోర్సులకు 7 క్రెడిట్స్‌ కేటాయించారు. చివరి రెండు సెమిస్టర్లలో విద్యార్థులు రెండు ప్రధాన సబ్జెక్టులపై దృష్టి సారించాలని, ఇంటర్న్‌షి్‌పతోపాటు అదనపు కోర్సులు నేర్చుకోవాలన్న లక్ష్యంతో కొత్త క్రెడిట్స్‌ విధానం రూపొందించామని బాలకిష్టారెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్

గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 03:45 AM