Share News

Nitin Gadkari: అమృత సరోవరంగా రాష్ట్రం

ABN , Publish Date - May 06 , 2025 | 04:46 AM

తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత సరోవర్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు.

Nitin Gadkari: అమృత సరోవరంగా రాష్ట్రం

  • తెలంగాణ సహకరిస్తే జలవనరుల అభివృద్ధి.. ఖర్చు భరించి అద్భుతంగా చేస్తాం: కేంద్ర మంత్రి గడ్కరీ

  • కాగజ్‌నగర్‌లో జాతీయ రహదారి-363.. బీహెచ్‌ఈఎల్‌, అంబర్‌పేట ఫ్లైఓవర్ల ప్రారంభం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రాన్ని అమృత సరోవర్‌గా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఆశించకుండా నేషనల్‌ హైవే అథారిటీ తరఫున మట్టి, పూడికతీత పనులను చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు సీఎంతో చర్చించేందుకు చొరవ చూపాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్కను కోరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నీటి నిల్వలు పెంచేందుకు వెయ్యి అమృత సరోవర్లను నిర్మించామని, తద్వారా భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. రూ.3,099 కోట్లతో నిర్మించిన మంచిర్యాల-వాంకిడి జాతీయ రహదారి-363ని సోమవారం కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద గడ్కరీ ప్రారంభించారు. మరో రూ.3 వేల కోట్లతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అదే విధంగా హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ చౌరస్తాలో రూ.138 కోట్లతో, అంబర్‌పేటలో రూ.145 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను గడ్కరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద, అంబర్‌పేటలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ఏ పట్టణం నుంచైనా ఐదు గంటల్లో హైదరాబాద్‌కు వచ్చేలా జాతీయ రహదారుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.


వచ్చే మూడేళ్లలో తెలంగాణలో పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలను హైదరాబాద్‌కు అనుసంధానం చేసేలా జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు చేస్తున్న సంస్థను మార్చామని 8, 10 నెలల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌-విశాఖపట్టణం మధ్య నిర్మించే రహదారితో ప్రయాణ సమయం 12 నుంచి 6 గంటలకు తగ్గుతుందని చెప్పారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న హైదరాబాద్‌-గోవా జాతీయ రహదారితో 50 కి.మీ. దూరం తగ్గనుందన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు విస్తరించనున్నట్టు గడ్కరీ పేర్కొన్నారు. రూ.16 వేల కోట్లతో చేపడుతోన్న నాగ్‌పూర్‌-విజయవాడ రహదారి 21శాతం పూర్తయిందని, పనులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణ సమయం 13 నుంచి 6 గంటలకు తగ్గుతుందన్నారు. మనోహరాబాద్‌లో రూ.2 వేల కోట్లతో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు నిర్మిస్తున్నామని గడ్కరీ చెప్పారు. కృష్ణానదిపై రూ.1200 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నట్టు గడ్కరీ ప్రకటించారు. వంతెన అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌, నంద్యాల, తిరుపతి, చెన్నై మధ్య 80 కి.మీ. దూరం తగ్గుతుందని పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో ఫ్లాష్‌ చార్జింగ్‌ బస్సులు(గడ్కరీ ఎయిర్‌ బస్‌) అందుబాటులోకి తెచ్చామని, 100కుపైగా సీటింగ్‌ సామర్థ్యం ఉండే బస్సులో అల్పాహారం, టీ వంటివి లభిస్తాయని, బస్‌ హోస్టెస్‌ కూడా ఉంటారని చెప్పారు. హైదరాబాద్‌ రింగు రోడ్డుపై ఎయిర్‌ బస్‌ నడిపి చూడాలని రవాణా శాఖ మంత్రి పొనం్న ప్రభాకర్‌ను కోరారు.


బయోచార్‌ బ్రోచర్‌ ఆవిష్కరణ

గ్రామీణ పారిశ్రామిక వేత్తలు, రైతులకు నైపుణ్యాభివృద్ధి కోసం బయోచార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హాశాంతి వనంలో హార్ట్‌ఫుల్‌నెస్‌, పేపాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయోచార్‌ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. బయోచార్‌ విధానం వల్ల దేశంలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.


శరవేగంగా ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం: కిషన్‌రెడ్డి

దేశంలో ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కాగజ్‌నగర్‌ సభలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రోడ్డు, రైల్వే, విమానాల కనెక్టివిటీ పెంచిందని తెలిపారు. హైదరాబాద్‌, కరీంనగర్‌, మంచిర్యాల రాజీవ్‌ రహదారి అధ్వానంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాజీవ్‌ రహదారికి సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, కాంట్రాక్టర్‌తో మాట్లాడి పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవ చూపాలని కోరారు. రాజీవ్‌ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హమీ కూడా ఇచ్చారని తెలిపారు. తాము ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తామని, తర్వాత అభివృద్ధే లక్ష్యమని సంజయ్‌ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అటవీ అనుమతులకు క్లియరెన్స్‌ ఇచ్చేలా చూడాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రహదారులను నిర్మించాలని, అటవీ అనుమతులు లేని రహదారులకు అనుమతులు ఇప్పించాలని మంత్రి సీతక్క కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Telangna News And Telugu News

Updated Date - May 06 , 2025 | 04:46 AM