Srisailam Dam: శ్రీశైలం ప్లంజ్పూల్ వద్ద గొయ్యి పూడ్చివేతపై అధ్యయనం
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:42 AM
శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు పాటించాల్సిన మెథడాలజీపై అధ్యయనం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి ప్రభుత్వం అప్పగించింది.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి బాధ్యత.. జలవనరుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు పాటించాల్సిన మెథడాలజీపై అధ్యయనం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి ప్రభుత్వం అప్పగించింది. అధ్యయనం చేసే సమయంలో వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉందని కర్నూలు జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ తెలియజేయగా.. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జలవనరుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.51 లక్షలు చెల్లించనున్నట్లు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2009 వరదల సమయంలో శ్రీశైలం జలాశయం ముందు భాగాన యాప్రాన్ ప్రాంతంలో ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన ఈ భారీ గొయ్యి డ్యాంకే పెను ప్రమాదంగా మారుతుందని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని జాతీయ జలాశయ భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ)ను పదే పదే కోరుతున్నాయి. ఆ సంస్థ నిన్నమొన్నటివరకు దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చింది. అయితే ఇటీవల సదరు గొయ్యితో జలాశయానికి భారీ ముప్పు పొంచి ఉందని జాతీయ స్థాయి పరిశోధనా సంస్థలు, జల వనరుల నిపుణులు కేంద్రానికి హెచ్చరికలు చేశారు. దరిమిలా ఈ నెల 28న ఎన్డీఎ్సఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం విజయవాడ రానుంది. సాయిప్రసాద్తో సమావేశమవుతుంది. మర్నాడు శ్రీశైలం వెళ్లి ఆ గొయ్యిని పరిశీలిస్తుంది. అక్కడే ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అవుతుంది. 30వ తేదీన తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతుంది. ఆ తర్వాత గొయ్యి పూడ్చివేతకు అనుసరించాల్సిన పద్ధతి, అంచనా వ్యయంపై నిర్ణయం తీసుకుంటుందని జల వనరుల శాఖ అధికారులు తెలియజేశారు.