NIMS: వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారు
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:47 AM
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నుంచి వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారని ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎన్.బీరప్ప తెలిపారు. ‘నిమ్స్కు వైద్యుల టాటా’ పేరిట గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి కథనానికి నిమ్స్ డైరెక్టర్ వివరణ
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నుంచి వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారని ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎన్.బీరప్ప తెలిపారు. ‘నిమ్స్కు వైద్యుల టాటా’ పేరిట గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు. 2022 జూన్ 30 నుంచి 2024 మే వరకు మొత్తం ఎనిమిది మంది వైద్యులు ఆసుపత్రిని వీడి వెళ్లిపోయారని తెలిపారు. ఇందులో ఐదుగురు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారని, మిగతా ముగ్గురు ఉద్యోగాలకు రాజీనామా చేశారని వివరించారు. నిమ్స్లో ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తున్నామని, 2023లో 14 మందికి, 2024లో 35 మందికి కల్పించామని చెప్పారు. సీనియర్ వైద్యులకు రూ.1.50 లక్షల చొప్పున లర్నింగ్ రిసోర్స్ అలవెన్సును ఇస్తున్నామని తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ను చేపడుతున్నామని తెలిపారు. 61 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, ఇందులో 42 మందిని రెగ్యులర్ ప్రాతిపదికన, మరో 19 మందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించామని నిమ్స్ డైరెక్టర్ వివరించారు.