నిలువురాళ్లకు ‘యునెస్కో తాత్కాలిక జాబితా’లో చోటు!
ABN , Publish Date - Mar 17 , 2025 | 03:41 AM
చారిత్రక నిలువురాళ్లను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దేశంలోని మరో ఐదు ప్రదేశాలతో కలిపి నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లను కూడా ఎంపిక చేశారు.

దేశంలోని మరో ఐదు ప్రదేశాలతో కలిపి ఎంపిక చేసిన కేంద్రం
ఆదిమానవుల వారసత్వ సంపద నిలువు రాళ్లు
యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు గర్వకారణం: జూపల్లి
మహబూబ్నగర్/కృష్ణ/హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): చారిత్రక నిలువురాళ్లను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దేశంలోని మరో ఐదు ప్రదేశాలతో కలిపి నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్లో ఉన్న నిలువురాళ్లను కూడా ఎంపిక చేశారు. ఈ నిలువురాళ్లను పురాతన కాలంలో సమయం, వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడం కోసం పరిశోధనా లయంగా వినియోగించుకునేవారని పురావస్తుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1980లో ఇంగ్లండ్కు చెందిన అల్చీన్ ద్వారా నిలువురాళ్ల చరిత్ర వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం యునెస్కో గుర్తింపునకు పంపనున్న తాత్కాలిక జాబితా లో చోటు దక్కగా.. శాశ్వత గుర్తింపు వచ్చే వరకు పనిచేస్తామని జై మక్తల్ అధ్యక్షుడు సందీప్ మక్తాలా ఆదివారం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నిలువురాళ్లను పరిశీలించిన సందర్భంగా తెలిపారు.
భారత్ చేసిన ప్రతిపాద నలను పరిశీలించాక యునెస్కో బృందం ఈ ప్రాంతానికి వస్తుంది. ఇక్కడ పరిశోధనలు చేసిన తర్వాత గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నిలువురాళ్లు ఇంగ్లండ్లోని వీల్షైర్ ప్రాంతంలో ఉన్న స్టోన్హెంజ్ తరహాలో ఉన్నాయని భావిస్తుండగా.. వాటికి ఎప్పుడో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కింది. నిలువురాళ్లకు యునెస్కో గుర్తింపునకు పంపించనున్న తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి జూపల్లి అన్నారు. ఈ రాళ్లు ఆదిమాన వుల వారసత్వ సంపదగా నిలుస్తున్నా యని చెప్పారు. నాలుగు వేల ఏళ్ల కిందట ఈ నిలువురాళ్ల ద్వారా ఖగోళ విషయాలను, కాలగమనాన్ని తెలుసుకోవడం అద్భుతమని తెలిపారు. యు నెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే ప్రపంచ పటంలో ముడుమాల్ నిలువురాళ్లు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు.