Yadagirigutta: యాదగిరీశుడి చెంతన..
ABN , Publish Date - May 16 , 2025 | 03:24 AM
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.

స్వామి వారి దర్శనానికి మిస్ వరల్డ్ పోటీదారులు
ఆలయ ప్రాంగణంలో కోలాటం.. స్వామివారికి పూజలు
సుందరీమణుల మనసు దోచిన చేనేత, ఇక్కత్ చీరలు
పోచంపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా చేనేత వస్త్రాల ప్రదర్శన
‘తెలంగాణ జరూర్ ఆనా’ అంటూ అందగత్తెల నినాదాలు
యాదాద్రి, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలైన యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లిలో మిస్ వరల్డ్ పోటీదారులు సందడి చేశారు. గురువారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. కరేబియన్ గ్రూప్కు చెందిన తొమ్మిది దేశాల భామలు యాదగిరిగుట్టలో స్వామివారికి పూజలు నిర్వహించగా, ప్రపంచ పర్యాటక కేంద్రం భూదాన్పోచంపల్లిలో 25 దేశాలకు చెందిన ఆఫ్రికన్ అందగత్తెలు సందడి చేశారు. సుందరాంగులు తలలో మల్లెపూలు పెట్టుకుని.. లంగా వోణీలు, చీరలు ధరించి వచ్చారు. సాయంత్రం 5 గంటలకు బ్యాటరీ వాహనాల్లో ఆలయ ప్రాంగణంలోకి వెళ్లారు. 5.48 గంటలకు ఆలయ మాఢవీధుల్లోకి చేరుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు వారికి స్వాగతం పలికారు. అన్నామాచర్య ట్రస్ట్ కళాకారుల నృత్య ప్రదర్శన, కోలాటం మధ్యలో అందాల భామలు నడుచుకుంటూ వెళ్లారు. బంగారు తాపడం ఉన్న గోపురాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. స్వర్ణ ధ్వజ స్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. తూర్పు రాజగోపురం నుంచి త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పంచనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపంలో వేద పండితులతో ఆశీర్వచనం పొందారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి స్వామివారి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం అతిథి గృహానికి వెళ్లారు. అక్కడే కాసేపు సేదతీరిన తర్వాత 7.15 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. ప్రపంచ సుందరీమణులు 2.15 గంటల పాటు ఆలయంలో ఉన్నారు. వీరి రాకతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాలను నిలిపివేశారు.
ఆలయ విశిష్టతను వివరించిన అధికారులు
కొండపైకి చేరుకున్న అందగత్తెలకు వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్రావు ఆలయ విశిష్టతను వివరించారు. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సతీసమేతంగా, రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి అధికారులతో కలిసి అఖండ దీపారాధన వరకు స్వాగతం పలికారు. అందాల భామలు పశ్చిమ, ఉత్తర తిరువీధుల నుంచి వస్తుండగా కళాకారులతో కలిసి రెండు నిమిషాల పాటు కోలాటం, నృత్యం చేశారు.
ఫ్యాషన్ షో అదుర్స్..
ప్రపంచ అందగత్తెలే అసూయ పడేలా భారతీయ నారీమణుల ఇక్కత్ చీరల ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది. సంప్రదాయం ఉట్టిపడేలా ధరించిన చేనేత, ఇక్కత్ వస్త్రాలతో షో చేసిన యువతీయువకులు యాంపీ థియేటర్లో జోష్ నింపారు. షో జరుగుతున్నంత సేపు అందాల భామలు కళ్లార్పకుండా చూస్తూ చప్పట్లు, కేరింతలతో ప్రోత్సహించారు.
మనసు దోచిన చేనేత, ఇక్కత్
ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి గాంచిన భూదాన్పోచంపల్లి ప్రపంచ సుందరీమణుల మనసు దోచుకుంది. తెలంగాణలోని చేనేత రంగాన్ని ప్రభుత్వం విశ్వవ్యాప్తం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో బాగంగా మిస్ వరల్డ్ పోటీదారులను గురువారం పోచంపల్లికి తీసుకెళ్లింది. ఆఫ్రికాలోని 25 దేశాలకు చెందిన పోటీదారులు పోచంపల్లిలో చీరల తయారీ, డిజైన్, అద్దకం, ఇక్కత్ వస్త్రాలను చూసి అబ్బురపడ్డారు. మిస్వరల్డ్ పోటీల సందర్భంగా చేనేత, ఇక్కత్ వస్త్రాలపై దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పోచంపల్లిలో ఫ్యాషన్ షో నిర్వహించింది. చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని పరిశీలించిన ప్రపంచ అందగత్తెలు మైమరచిపోయారు. రంజు వాయిద్యం, నాదస్వరం, కోలాటాలతో పలికిన స్వాగతంతో సంబరపడిపోయారు. చేనేతల కళాత్మక వస్త్రాలు సుందరీమణులను ఆకట్టుకున్నాయి. నుదుటిన బొట్టు పెట్టి, పూలమాలలు అందిస్తూ సుందరాంగులకు ఆత్మీయ స్వాగతం పలికారు. పోచంపల్లి చేనేత టూరిజం పార్కు ప్రవేశ ద్వారం వద్ద ఫొటోలకు పోజులిస్తూ ‘తెలంగాణ జరూర్ ఆనా’ అంటూ నినాదాలు చేశారు. ఇక్కత్ చీరల తయారీని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. చేనేత టూరిజంపార్కులో కళాకారులు ప్రదర్శించిన రంజు, కిన్నెర వాయిద్యాలు మంత్రముగ్ధులను చేశాయి. కొందరు భామలు రంజు వాయించగా, మరికొందరు సంగీతానికి తగ్గట్లుగా నాట్యం చేశారు. మెహందీ స్టాల్ వద్ద గోరింటాకు డిజైన్లు వేయించుకున్నారు. యాంపీ థియేటర్లో పోచంపల్లి ప్రస్థానం, చేనేతపై వీడియోను వీక్షించారు.
నేడు పిల్లలమర్రికి సుందరీమణులు
హైదరాబాద్/మహబూబ్నగర్/శంకర్పల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందగత్తెలు శుక్రవారం పాలమూరు సమీపంలోని 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని సందర్శించనున్నారు. మూడున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం ప్రపంచ గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో 22 మంది మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి 3 ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటారు. 2 గంటల పాటు అక్కడ గడపనున్నారు. ముందుగా 16వ శతాబ్దం నాటి రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్తారు. అనంతరం అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర-సంస్కృతి ఆనవాళ్లు, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను సందర్శించనున్నారు. తర్వాత మహావృక్షం వద్దకు చేరుకుంటారు. ఇక్కడ ఫొటో షూట్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు తిరుగుప్రయాణం అవుతారు. 1300 మంది పోలీసులతో మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. వారం రోజులుగా జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎకో పార్కుకు అందాల భామలు..
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరుకు శుక్రవారం మరికొందరు ప్రపంచ అందగత్తెలు రానున్నారు. ఎక్స్పీరియం ఎకో ప్రెండ్లీ పార్కులో సందడి చేయనున్నారు. పార్కులోని ప్రకృతి అందాలను తిలకించనున్నారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7గంటల వరకు పార్కులో గడపనున్నారు. ఈ సందర్భంగా పార్కులోని వివిధ జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతలను నిర్వాహకులు వారికి వివరించనున్నారు. కాగా, మిస్వరల్డ్ పోటీదారులు ఆదివారం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5.30నుంచి 7.30వరకు అక్కడే ఉంటారు. సచివాలయంపై ప్రదర్శించే 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్లో తెలంగాణ చరిత్ర, అభివృద్ధిని వీక్షిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్ను భారత్కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్కు చుక్కెదురు
For Telangana News And Telugu News