Share News

Ramappa Temple: 800 ఏళ్ల క్రితం నాటి శిల్పానికి హైహీల్సా!

ABN , Publish Date - May 15 , 2025 | 04:06 AM

ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సందర్శించిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు ఎదురైన అనుభవాలు ఇవి. కాకతీయుల శిల్పకళావైభవానికి ప్రతీకైన చారిత్రాత్మక నిర్మాణాన్ని చూసి వారంతా మైమరిచిపోయారని స్థానిక గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ చెప్పారు.

Ramappa Temple: 800 ఏళ్ల క్రితం నాటి శిల్పానికి  హైహీల్సా!

  • రామప్ప శిల్ప కళా సౌందర్యానికి అందాల భామల ఫిదా

  • నాట్యగత్తెల ముద్రలను అనుకరిస్తూ ఫొటోలు

హైదరాబాద్‌ సిటీ, మే 14(ఆంధ్రజ్యోతి): 800 ఏళ్ల క్రితం చెక్కిన శిల్పంలోని యువతి కాలికి హైహీల్స్‌ పాదరక్షలా..!! శిల్పాల ఆహార్యంలో మినీ స్కర్ట్‌లా .!! ఆలయ గోడలపై ఈజిప్టు, పర్షియన్‌, రోమన్‌ దేశాల వనితల శిల్పాలా..!! ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన చారిత్రక రామప్ప దేవాలయాన్ని బుధవారం సందర్శించిన మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు ఎదురైన అనుభవాలు ఇవి. కాకతీయుల శిల్పకళావైభవానికి ప్రతీకైన చారిత్రాత్మక నిర్మాణాన్ని చూసి వారంతా మైమరిచిపోయారని స్థానిక గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ చెప్పారు. మరీ ముఖ్యంగా సాలభంజికలు, మదనికలు, నాట్యగత్తెల శిల్ప సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారని తెలిపారు. కొందరైతే రాగిణి శిల్పానికి ఆనాడే చెక్కిన హైహీల్స్‌ పాదరక్షలను చూసి నోరువెళ్లబెట్టారని చెప్పారు. మరొక సాలభంజిక ఆహార్యంలో మినీ స్కర్ట్‌(పొట్టి వస్త్రాలు), మదనికల విభిన్న హెయిర్‌స్టైల్స్‌, కాలి అందెలు, చేతి కంకణాలు తమనెంతగానో ఆకట్టుకున్నాయని సుందరీమణులు స్థానిక గైడ్లతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.


ఆలయ గోడలపై ఈజిప్టు, పర్షియన్‌, రోమన్‌ దేశాల వనితల శిల్పాలు చూసి 13వ శతాబ్దంలోనే ఇదెలా ఎలా సాధ్యమైందంటూ గైడ్లను ప్రశ్నలమీద ప్రశ్నలు వేశారు. అలాగే, భరతముని నాట్యశాస్త్రమంతా కొలువుదీరి ఉండే నాట్యభంగిమలు, ఆ శిల్పాలలో తొణికిసలాడే సౌందర్యానికి సమ్మోహితులయ్యారు. ‘ప్రపంచంలో మరెక్కడా ఇంతటి అద్భుతమైన శిల్పసౌందర్యాన్ని చూడలేదంటూ’ తోటివారితో చెబుతూ సుందరీమణులు తమ సంతోషాన్ని పంచుకున్నారని గైడ్లు చెప్పారు. మిస్‌ వరల్డ్‌ పోటీదారులు నాట్యభంగిమలను అనుకరిస్తూ రకరకాల ముద్రలతో ఫొటోలు దిగడం, అమితాసక్తితో ఆలయ నిర్మాణాన్ని తిలకించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని టి. వెంకటేష్‌ అనే గైడ్‌ చెప్పారు. కొన్ని దేశాల వారైతే శిల్పాలను చూసి ఆనందం పట్టలేక ఎగిరి గంతేసినంత పనిచేశారని విజయ్‌ చెప్పారు. మిస్‌వరల్డ్‌ పోటీదారుల్లో ఏ ఒక్కరిలోనూ తాము దర్పం, అహంభావం చూడలేదని గైడ్లు కొనియాడారు. సాధారణ భక్తుల్లాగే సాదాసీదాగా మెలిగారని, ఆలయ చరిత్ర తెలుసుకోడానికి అమితాసక్తి కనబరిచారని చెప్పారు. భూకంపాలను తట్టుకొని నిలిచేలా రామప్ప నిర్మాణంలో ఆనాడు వినియోగించిన శాండ్‌బాక్స్‌ టెక్నాలజీ, నీళ్లలో తేలాడే ఇటుకల ప్రత్యేకతను నిట్‌ విశ్రాంత ఆచార్యుడు పాండురంగారావు వారికి వివరించారు.


రవ్వకేసరి రుచిచూసి...

సంప్రదాయ దుస్తుల్లో భారతీయత ఉట్టిపడేలా సింగారించుకొని వచ్చిన సుందరీమణులు పరమశివుని పూజలో పాల్గొన్నారు. విభూతి, కుంకుమ నుదుట ధరించి... తీర్థ, ప్రసాదాలు అందుకున్నారు. పూజారి శఠగోపం పెడుతున్న సమయంలో కొందరు భామలు పసిపిల్లల్లా సంబురపడ్డారని ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. ఇక, రవ్వకేసరి ప్రసాదాన్ని అందాల భామలు లొట్టలేసుకొని మరీ తిన్నారట


సుందరీమణి కాళ్లు తుడిపించారంటూ విమర్శలు

16.jpg

వెంకటాపూర్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ పోటీదారులు రామప్ప దేవాలయంలోకి ప్రవేశించే ముందు... వారు కాళ్లు కడుక్కునేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక తాంబాళాలు ఏర్పాటు చేశారు. స్థానిక వలంటీర్లు వారికి నీళ్లు, టవల్‌ అందించి కాళ్లు కడుక్కునేందుకు సహకరించారు. అయితే, వలంటీర్లలో ఒకరు ఓ సుందరీమణి కాళ్ల వద్దకి టవల్‌ పట్టుకుని ఉన్నట్టుగా ఉన్న వీడియో ఒకటి బయటికి రాగా ఆ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మిుస్‌ వరల్డ్‌ పోటీదారుల కాళ్లు తుడిపించి ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులను అవమానించింది అని బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 04:06 AM