Miss World 2025: సాగర్లో సుందరీమణుల సందడి
ABN , Publish Date - May 13 , 2025 | 03:37 AM
మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ను సందర్శించారు.

బుద్ధవనాన్ని సందర్శించిన అందగత్తెలు
బుద్ధుడికి మిస్ వరల్డ్ పోటీదారుల నివాళి, బౌద్ధభిక్షువుల ఆశీర్వచనం
బుద్ధపీఠం వద్ద ప్రార్థనలు, ధ్యానం
నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్
రేపు ఓరుగల్లుకు అందాలభామలు
వరంగల్ కోట, వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం సందర్శన
నల్లగొండ/హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు సోమవారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ను సందర్శించారు. పర్యాటక క్షేత్రమైన సాగర్లో ప్రపంచశాంతికి నెలవైన బుద్ధవనాన్ని చూసి ఆనందపరవశులయ్యారు. సాగర్ జలాశయాన్ని చూసి తన్మయం చెందారు. ఆసియా దేశాలకు చెందిన 22 మంది అందాల భామలు ప్రత్యేక బస్సులో సోమవారం సాయంత్రం 4:55 గంటలకు నాగార్జునసాగర్ హిల్కాలనీలోని విజయవిహార్ అతిథి గృహానికి చేరుకున్నారు. వారికి జిల్లా అధికార యంత్రాంగం ఘనస్వాగతం పలికింది. ప్రతిగా ‘నమస్తే తెలంగాణ.. జరూర్ ఆనా’’ అంటూ సుందరీమణులు నినదించారు. భారతదేశ సంస్కృతితో రెండు చేతులు జోడించి నమస్కరించారు. వారికి కీర దోస, నిమ్మరసం, పుదీనాతో కూడిన వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాగర్ జలాశయం ఒడ్డున నిర్వహించిన ప్రత్యేక ఫొటో షూట్లో అందాలభామలు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక.. ప్రపంచ సుందరి పోటీదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయవిహార్ వద్ద ఏర్పాటు చేసి న మీడియా పాయింట్ వద్దకు వచ్చి అందాలభామ లు అభివాదం చేసి ఫొటోలు దిగారు. సాయంత్రం 6 గంటలకు బుద్ధవనం చేరుకున్నారు. వారికి గిరిజన నృత్యంతో స్వాగతం పలకగా, బుద్ధ జయంతి సందర్భంగా బౌద్ధ భిక్షువులు ఆశీర్వచనం చేశారు.
ధ్యాన మందిరంలో ప్రార్థనలు..
అందాలభామలు బుద్ధవనంలోని ధ్యాన మందిరానికి వెళ్లి ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. బుద్ధవనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంతోపాటు బుద్ధుడి జీవిత చరిత్రను తెలిపే విగ్రహాలను చూసి ఆశ్చర్యపోయారు. బుద్ధపీఠం వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం బుద్ధవనంలోని మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఫొటో షూట్లో పాల్గొన్నారు. బుద్ధవనం ప్రత్యేకతను, బుద్ధుని జీవి త విశేషాలను పర్యాటక శాఖ గైడ్ ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. బుద్ధ జయంతి పురస్కరించుకుని కొవ్వొత్తులతో నివాళులర్పించిన అనంతరం బుద్ధ ధమ్మ వద్ద ధ్యానం చేశారు. జాతకవనాన్ని సందర్శించి ఓపెన్ ఎయిర్ థియేటర్లో ప్రదర్శించిన బుద్ధ చరిత్ర నాటకాన్ని, పర్యాటక శాఖ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను తిలకించారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి విందులో పాల్గొన్నారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు బాలునాయక్, జైవీర్రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమే్షరెడ్డి తదితరులు హాజరయ్యారు. రాత్రి 7.55 గంటలకు సుందరీమణులు హైదరాబాద్కు బయలుదేరారు.
తెలంగాణ పేరు ప్రతిబింబించేలా!
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ పేరు ప్రతిబింబించేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుద్థవనంలో ధ్యానం చేసేందుకు వచ్చిన సుందరీమణులకు ‘తెలంగాణ జరూర్ ఆనా’ లోగోను ముద్రించిన కొబ్బ రి బోండాలను అందించారు. అందాల తారలు మెడలో వేసుకునేందుకు కండువాలు ఇచ్చారు. తెలుపు రంగు కండువాలపై అశోక చక్రం, తెలంగాణ ప్రభుత్వ లోగో, తెలంగాణ టూరిజం లోగోతో పాటు బుద్ధవనం లోగోను ముద్రించారు. బుద్ధవనంలో పూజలు, ప్రార్థనలు చేసేందుకు కర్ణాటకలోని మైసూర్కు చెందిన 9 మంది బౌద్ధ భిక్షవులను రప్పించారు. హైదరాబాద్, మహేంద్రహిల్స్లోని మహాబోధి బుద్ధవిహార్ నుంచి వచ్చిన మరో 16 మంది భౌద్ద భిక్షవులు కూడా బిక్కి సంగపాల ఆధ్వర్యంలో ప్రార్థనలు, పూజలు నిర్వహించారు.
నేడు హెరిటేజ్ వాక్.. రేపు ఓరుగల్లుకు
హైదరాబాద్ సిటీ/వరంగల్: మిస్ వరల్డ్-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్-2025 హెరిటేజ్ వాక్, చౌమల్లా ప్యాలె్సలో వెల్కమ్ డిన్నర్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో చార్మినార్ జోన్ పరిధిలోని ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. కాగా, మిస్వరల్డ్ పోటీదారులు బుధవారం ఓరుగల్లు పర్యటనకు రానున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. కాగా, 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని.. అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత కాటేజీల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..
భూ భారతి చట్టం రైతులకు రక్షణ కవచం..
For More AP News and Telugu News