Share News

Miss World 2025: శిల్ప.. సౌందర్యం

ABN , Publish Date - May 15 , 2025 | 03:56 AM

సంప్రదాయ చీరకట్టు, నుదుట బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి.. ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేశారు.

Miss World 2025: శిల్ప.. సౌందర్యం

  • రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరీమణుల సందడి

  • చీరకట్టు.. నుదుట బొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబు

  • వరంగల్‌ కోట, రామప్ప, వేయి స్తంభాల గుడి సందర్శన.. పూజలు

  • కాకతీయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులైన ముద్దుగుమ్మలు

ములుగు/వెంకటాపూర్‌/వరంగల్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయ చీరకట్టు, నుదుట బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి.. ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేశారు. దేవాలయాలను దర్శించుకున్నారు. పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలకు పోజులిస్తూ వయ్యారాలు పోయారు. మొత్తంగా బుధవారం మిస్‌వరల్డ్‌-2025 పోటీదారులు ఓరుగల్లు పర్యటనలో సందడిగా గడిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు రెండు బృందాలుగా వచ్చిన 57 మంది సుందరీమణులు చారిత్రక వేయిస్తంభాల ఆలయం, వరంగల్‌ కోట, రామప్ప ఆలయాలను సందర్శించారు. తొలుత వివిధ దేశాలకు చెందిన 33 మంది ముద్దుగుమ్మలు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రంలోని హరిత హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారత సంప్రదాయ చీరకట్టులో ములుగు జిల్లాలో వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి వచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మంత్ర ముగ్ధులయ్యారు. కాకతీయుల కాలం నాటి శిల్పాలను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. ఆదివాసీ కొమ్ముకోయ నృత్యంతో సుందరీమణులకు ఎర్రటి తివాచీ పరిచి.. జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ సమీపంలోని రాతి గోడ వద్ద అతిథుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తాంబాళాల్లో కాళ్లు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు హరీ్‌షశర్మ, ఉమాశంకర్‌.. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి సుందరీమణులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎన్‌ఐటీ మాజీ ప్రొఫెసర్‌ పాండురంగారావు రామప్ప ఆలయ విశిష్టతను వివరించారు.


ఆలయం నుంచి బయటకు వస్తూ ’తెలంగాణ... జరూర్‌ ఆనా’ అంటూ సుందరీమణులు నినదించారు. భారతదేశ సంప్రదాయం ప్రకారం రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఫొటోలకు ఫొజులిచ్చి.. సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీ్‌షలతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. అనంతరం ఆలయ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభాస్థలం వద్దకు చేరుకుని.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ అలేఖ్య పుంజాల తన బృందంతో కలిసి రాణి రుద్రమదేవి చరిత్రను నృత్యం రూపంలో ప్రదర్శించి అతిథులను మెప్పించారు. పేరిణి నృత్య కళాకారుడు గజ్జెల రంజిత్‌కుమార్‌ బృందం శివతాండవ నృత్యం ప్రదర్శించారు. టూరిజం శాఖ ఏర్పాటు చేసిన లేజర్‌ షోను అందాలభామలు ఆస్వాదించారు. అతిథులకు అటవీశాఖ ఆధ్వర్యంలో వెదురు కర్రతో తయారు చేసిన అందమైన బహుమతులను మంత్రి సీతక్క, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్‌ దివాకర, ఎస్పీ శబరీష్‌ చేతుల మీదుగా అందజేశారు.ఆలయ తూర్పు ముఖద్వారం వైపు ఉన్న ఇంటర్‌ ప్రిటీషన్‌ సెంటర్‌లో సుందరీమణులు విందు చేసి అక్కడినుంచి బయలుదేరారు.


శిల్పవనంలో ముద్దుగుమ్మల సందడి

ప్రపంచ సుందరి పోటీదారుల్లో 22 మంది మరో బృందంగా వరంగల్‌ కోటను సందర్శించారు. సాయంత్రం 4.35 గంటలకు హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్న సుందరీమణులకు స్థానిక మహిళలు బతుకమ్మలతో సంప్రదాయ డోలు, వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి అందగత్తెలు బతుకమ్మ ఆట, పాటలతో నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. చారిత్మ్రక వేయి స్తంభాల ఆలయానికి చేరుకున్న అందాల భామలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. తొలుత సుందరీమణులు ఆలయం ఆవరణలో ఉన్న కోనేరును పరిశీలించారు. శిలా శాసనంలో ఉన్న ఆలయ చరిత్రను గైడ్‌ వివరించారు. సుందరీమణుల కోసం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తాంబాళాల్లో చెంబులోని నీటితో కాళ్లను కడుక్కున్నారు. ఆలయంలోని నందిని చూసి ఆశ్చర్యపోయారు. వేయి స్తంభాలతో ఆలయాన్ని నిర్మించారని, ఇసుకతో పునాదులను ఏర్పాటు చేశారని గైడ్‌ తెలిపారు. శివుడు, విష్ణువుతో పాటు సూర్యుడు కొలువైన పుణ్యక్షేత్రంగా సుందరీమణులకు వివరించారు. అనంతరం నంది విగ్రహం వద్ద మిస్సమ్మలు పోటీపడి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. దక్షిణం వైపు పునరుద్ధరించిన కల్యాణ మండపం వద్దకు వెళ్లి విద్యుత్‌ కాంతులు జిగేల్‌ జిగేల్‌ అంటుండగా.. ఫొటోలకు ఫోజులిచ్చారు. అధికారులకు, మీడియా, అక్కడి వచ్చిన వారికి నమస్కార్‌ అంటూ చేతులు ఊపుతూ ఉత్సాహన్ని చూపించారు. అనంతరం గర్భగుడిలో శివలింగం వద్ద రుద్రేశ్వరస్వామికి ముద్దుగుమ్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్‌శర్మ ప్రపంచ అందగత్తెలకు పుష్పగుచ్చాలు ఇచ్చి, పూర్ణకుంభ స్వాగతంతో పాటు వేదమంత్రాలు, మంగళవాయిద్వాలతో స్వాగతం పలికారు. రుద్రేశ్వరస్వామికి అభిషేకాలు చేయించారు. ముద్దుగుమ్మలకు తీర్థప్రసాదాలను అందించి జరి అంచు కండువాలతో సత్కరించారు. వేయి స్తంభాల ఆలయంలో సుందరీమణులు సుమారు గంటసేపు గడిపారు.

55-Sliders.jpg


కోటలో సుందరీమణులు కోలాహలం

కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన వరంగల్‌ కోటను సుందరీమణులు తిలకించారు. కీర్తితోరణం వద్ద పోటాపోటీగా ఫొటోలకు ఫోజులిచ్చారు. కోట నిర్మాణం, చరిత్రతో పాటు స్వయంభూ శివాలయం లాంటి కాకతీయుల నిర్మాణాలు, ప్రాముఖ్యతలను సౌండ్‌ అండ్‌ లైట్‌ ద్వారా ప్రదర్శిస్తూ మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు వివరించారు. కోటలోని శిల్పవనంలో శిలలను పరిశీలించారు. ఫొటోలకు ఫోజులిస్తూనే.. సెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ తమ ఆనందాన్ని తమ దేశంలోని వారితో పంచుకున్నారు. కాగా, కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్న పేరిణి నృత్యాన్ని కళాకారులు వరంగల్‌ కోటలో ప్రదర్శించి ముద్దుగుమ్మలను ఆశ్చర్య పరిచారు. రాణిరుద్రమ నృత్య రూపకం సుందరీమణులను మంత్రముగ్దులను చేసింది. కోటలో ఏర్పాటు చేసిన ప్లియా మార్కెట్‌ను సుందరీమణులు సందర్శించారు. వీరికి ఇటీవలే జీఐ ట్యాగ్‌ పొందిన చపాట మిర్చిని చూపించారు. అలాగే వరంగల్‌ పసుపును పరిచయం చేస్తూ, దాని ప్రత్యేకతలను తెలిపారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన వరంగల్‌ దర్రీస్‌ (జంపకానాలు) గురించి వివరించారు. అందాలభామలకు వరంగల్‌ కళాకారులు అరుదైన జ్ఞాపికలను అందించారు. నగరంలోని రంగశాయిపేటకు చెందిన కళాకారులు ఆరు నెలలుగా శ్రమించి తయారు చేసిన షీల్డులను, బ్యాగ్‌లను అందజేశారు. వారి కోసం తయారు చేసిన ప్రత్యేక వంటకాలను వడ్డించారు. మిస్‌వరల్డ్‌ పోటీదారుల పర్యటనకు పోలీసులు సుమారు వెయ్యిమందితో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా, మిస్‌ వరల్డ్‌ పోటీలకు ఆతిథ్యం ఇవ్వటం తెలంగాణకు గర్వకారణమని మంత్రి కొండా సురేఖ అన్నారు. మిస్‌ వరల్డ్‌ పోటీ దారులకు వరంగల్‌ కోటలో కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఇది చక్కటి అవకాశమన్నారు. ఈ పోటీలతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రచారం లభిస్తోందని పేర్కొన్నారు.


కొందరు పోటీల్లో.. మరికొందరు పర్యటనల్లో..

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు ఒక్కో రోజు రాష్ట్రంలోని ఒక్కో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళుతున్నారు. తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచ వ్యాప్తం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనలకు రూపకల్పన చేసింది. అయితే ఓవైపు ప్రపంచ సుందరి పోటీలు కొనసాగిస్తూనే ఈ పర్యటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్‌ పోటీని రోజుకు కొందరికి చొప్పున బ్యాచ్‌ల వారీగా నిర్వహిస్తున్నట్లు, ఆరోజు పోటీలేని వారు పర్యటనలకు వెళుతున్నట్లు సమాచారం.

నేడు యాదగిరిగుట్టకు.. పోచంపల్లికి

14.jpg

ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనున్నారు. మరో బృందం సుందరీమణులు చేనేత కళాత్మకతకు ప్రసిద్ధి గాంచిన భూదాన్‌పోచంపల్లిని వెళ్లనున్నారు.


ప్రజాసంఘాలు, మహిళల నిరసన..

మిస్‌ వరల్డ్‌ పోటీలను రద్దు చేయాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసనలకు దిగారు. వేయి స్తంబాల ఆలయం వద్ద మిస్‌ వరల్డ్‌ పోటీదారులు ఆలయానికి వస్తున్న క్రమంలో నేషనల్‌ ఫెడరేషన్‌ ఆప్‌ ఇండియన్‌ ఉమెన్‌ (ఎన్‌ఎ్‌ఫఐడబ్ల్యు ), చైతన్య మహిళా సమాఖ్య, పౌరహక్కుల సంఘం, డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ ఆఽధ్వర్యంలో మహిళలు, యువకులు రోడ్డుపైకి వచ్చి ఫ్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం సరిగ్గా అందక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం అందాల భామల పేరుతో ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తోందని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని హనుమకొండ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 06:01 AM