Share News

Minister Seethakka: కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు.. BRS నేతలకు గట్టిగా ఇచ్చిపడేసిన మంత్రి సీతక్క..

ABN , Publish Date - May 15 , 2025 | 05:25 PM

మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికీ తెలంగాణ సెంటిమెంటును రుద్దకండంటూ హెచ్చరించారు.

Minister Seethakka: కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు.. BRS నేతలకు గట్టిగా ఇచ్చిపడేసిన మంత్రి సీతక్క..
Minister Seethakka

Minister Seethakka: మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారంటూ బీఆర్ఎస్‌ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్నీ వక్రీకరించడం బిఆర్ఎస్‌ నాయకులకు పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు. ప్రతి చిన్న విషయానికీ తెలంగాణ సెంటిమెంట్ ను రుద్ది తెలంగాణ ప్రతిష్టను దిగజార్చవద్దని మంత్రి సీతక్క హెచ్చరించారు.


నిప్పులు పోసుకున్నారు..

ఈ సందర్భంగా బుధవారం నాడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు వరంగల్ వెయ్యి స్తంభాల గుడి, రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. హెరిటేజ్ వాక్ సక్సస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారని, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్లు వేశారు. ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని తిరిగిన నాయకుడు.. ఎలాంటి సంస్కృతి, సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క చురకలు అంటించారు.


దురహంకారం కాదా?..

"గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం గిరిజన సంప్రదాయం.. అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి సుందరీమణుల కాళ్లకు నీళ్లు పోసింది. దాన్ని పట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేసిందని బద్నాం చేస్తున్నారని, నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగితే అందరి కాళ్లూ కడిగించాలి కదా?. ఇలాంటి విషయాలను ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా?. ఎమ్మెల్సీ కవిత తన కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టుకోవడం, కలెక్టర్లతో కేసీఆర్ కాళ్లు మొక్కించుకోవడం దురహంకారం కాదా?. దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా..?" అంటూ సీతక్క నిప్పులు చెరిగారు.


అబద్దాలకు అంబాసిడర్‌గా

ఈమధ్య సబితా ఇంద్ర రెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసని.. అబద్ధాలు కాకుండా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అబద్దాలకు అంబాసిడర్ గా సబితమ్మ మారకూడదన్నారు. అధికారం పోయాక.. ప్రజలు, ఆత్మగౌరవం మీకు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు.

Updated Date - May 15 , 2025 | 06:49 PM