Medak Syrup Tragedy: వికటించిన సిరప్.. చిన్నారి మృతి
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:23 PM
Medak Syrup Tragedy: మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు తల్లి సిరప్ తాగించింది. ఆ వెంటనే ఆ చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.

మెదక్, జూన్ 7: జిల్లాలోని అల్లాదుర్గం మండల కేంద్రంలోని బుడగ జంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సిరప్ వికటించి ఐదుగురు చిన్నారులు ఆస్పత్రిపాలవ్వగా అందులో ఒక చిన్నారి మృతి చెందడం కలకలం రేపింది. బుడగజంగం కాలనీలో నివాసముంటున్న సాయమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, జలుబు సమస్యతో రేణుక, శ్రీను, ఐశ్వర్య, ప్రియ, గణేష్ అనే చిన్నారులు బాధపడుతున్నారు. దీంతో వారికి మందులు వేయాలని తల్లి భావించింది.
వెంటనే అల్లాదుర్గం పీహెచ్సీ నుంచి నెల క్రితం తీసుకువచ్చిన సిరప్లను చిన్నారులకు తల్లి సాయమ్మ తాగించింది. దగ్గు మందు సేవించిన కొద్దిసేపటికే ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన తల్లిదండ్రులు.. వెంటనే చిన్నారులను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐదు మంది చిన్నారుల్లో మూడో సంతానమైన ప్రియ మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐశ్వర్య, శ్రీను చికిత్స పొందుతూ కోలుకున్నారు. సిరప్ వేసిన తర్వాత తమ చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రులు చెబుతుండగా.. చిన్నారి చనిపోయింది సిరప్ వల్ల కాదని.. సిరప్ వాడటానికి ఇంకా సమయం ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చిన్నారి ఎలా చనిపోయింది అనే దానిపై స్పష్టం వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అలాగే మిగిలిన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులతో మాట్లాడారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు. చిన్నారి మృతికి సిరపే కారణమా లేక మరేదైనా కారణమా అనేదానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏపీకి గూగుల్.. స్థలం పరిశీలన పూర్తి
తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్
Read Latest Telangana News And Telugu News