Share News

Maoist: అంత్యక్రియలకు అవకాశమివ్వలేదు

ABN , Publish Date - May 27 , 2025 | 05:24 AM

ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా.. ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా.. ఛత్తీస్‌‌‌గఢ్‌ పోలీసులు వీటిని పట్టించుకోలేదు.

Maoist: అంత్యక్రియలకు అవకాశమివ్వలేదు

  • పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దహనం

  • మరో ఐదుగురు నక్సల్స్‌ మృతదేహాలకూ నిప్పు

  • ఎండుకట్టెల మధ్య వేసి కిరోసిన్‌తో దహనం చేసిన బలగాలు!

  • మృతదేహాలను అప్పగించమంటే.. ఇచ్చేది లేదని బెదిరించారు: బంధువులు

చర్ల/హసన్‌పర్తి, మే 26 (ఆంధ్రజ్యోతి): ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించాలని బంధుమిత్రులు విజ్ఞప్తి చేసినా.. ప్రజా సంఘాలు డిమాండ్లు చేసినా.. ఛత్తీస్‌‌‌గఢ్‌ పోలీసులు వీటిని పట్టించుకోలేదు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజుతోపాటు.. మరో ఐదుగురు నక్సల్స్‌ మృతదేహాలను ఛత్తీస్‌‌‌గఢ్‌ పోలీసులు దహనం చేశారు. సోమవారం ఈ మేరకు నారాయణపూర్‌ పోలీసులు ఓ ప్రకటన చేశారు. నారాయణపూర్‌ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలోని చెట్లు, పొదల మధ్య.. అందుబాటులో ఉన్న ఎండు కర్రలను వేర్వేరుగా పేర్చి, వాటి మధ్యలో మృతదేహాలను వేసి.. కిరోసిన్‌తో నిప్పుపెట్టారు. నంబాల సహా.. మిగతా ఐదుగురు నక్సల్స్‌కు అయినవారు, బంధుమిత్రులు లేరని పేర్కొంటూ పోలీసులు ఏకపక్షంగా దహన కార్యక్రమాలను నిర్వహించారు. మృతదేహాలను అప్పగించాలని పోలీసులను కోరితే.. తమను బెదిరించారని బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు. హనుమకొండ జిల్లా చింతగుట్టకు చెందిన బూర రాకేశ్‌ అలియాస్‌ వివేక్‌(32) మృతదేహం కోసం అతని తండ్రి బూర బాబు, కుటుంబ సభ్యులు ఛత్తీస్‌‌‌గఢ్‌కు వెళ్లారు. అయితే.. మృతదేహాలను ఇచ్చేది లేదంటూ నారాయణపూర్‌ పోలీసులు తేల్చిచెప్పారని వారు వాపోయారు. దాంతో మృతుల బంధుమిత్రులు నారాయణపూర్‌ ప్రభుత్వాస్పత్రి నుంచి పోలీస్‌‌స్టేషన్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.


అయితే.. పోలీసులు మాత్రం తాము చట్టపరంగా, జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశాలతో అంత్యక్రియలను నిర్వహించామని చెబుతున్నారు. ‘‘ఈ నెల 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది నక్సల్స్‌ చనిపోయారు. 20 మంది నక్సల్స్‌ మృతదేహాలను బంధుమిత్రులకు అప్పగించాం. కోసి అలియాస్‌ హంగి అనే మావోయిస్టు బంధుమిత్రులకు కూడా మృతదేహాన్ని అప్పగించాం. అయితే.. కుళ్లిపోతున్న ఆ మృతదేహం వల్ల అంటువ్యాధుల ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణపూర్‌లోనే అంత్యక్రియలకు అవకాశం కల్పించాలని కోరారు. మేము అందుకు అనుమతించాం. మిగతా ఆరు మృతదేహాలను చట్టపరంగా దహనం చేశాం’’ అని నారాయణపూర్‌ ఎస్పీ కార్యాలయం సోమవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది. అంత్యక్రియలకు సంబంధించిన వీడియోలను మీడియాకు షేర్‌ చేసింది. ఉద్యమం కోసం జీవితాలను త్యాగం చేసిన మావోయిస్టులకు ఇది తీవ్ర అవమానమని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఛత్తీస్‌‌‌గఢ్‌ పోలీసులు ఉద్దేశపూర్వకంగా మృతదేహాలను దహనం చేశారని వాపోయాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించకుండా, కుట్రపన్నాయని మండిపడ్డాయి. అడ్వొకేట్‌ జనరల్‌ కూడా చట్టప్రకారం ప్రక్రియ జరుగుతోందని ఛత్తీస్‌‌‌గఢ్‌ హైకోర్టుకు తెలిపినా.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించాయి.


అప్పట్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలు

2010లో గవాడి(నారాయణపూర్‌ జిల్లా), అదే సంవత్సరం ఏప్రిల్‌లో తాడ్మెట్ల, 2017 బుర్కపాల్‌(సుక్మా జిల్లా)లో జరిగిన దాడుల్లో మావోయిస్టులు అపహరించిన ఆయుధాల్లో కొన్ని తాజా ఎన్‌కౌంటర్‌లో లభ్యమైనట్లు నారాయణపూర్‌ పోలీసులు తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌లో మూడు ఏకే-47, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌, ఆరు ఇన్సాస్‌, ఒక కార్బైన్‌, ఆరు .303 తుపాకులను, ఒక బీజీఎల్‌ లాంచర్‌, రెండు రాకెట్‌ లాంచర్లు, మూడు 12-బోర్‌ తుపాకులు, ఒక నాటు పిస్టల్‌, రెండు భర్మార్లు, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 05:24 AM