Share News

Jogulamba Gadwal Protest: ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు

ABN , Publish Date - Jun 04 , 2025 | 11:39 AM

Jogulamba Gadwal Protest: పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Jogulamba Gadwal Protest: ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు
Jogulamba Gadwal Protest

జోగులాంబ గద్వాల, జూన్ 4: జిల్లాలోని రాజోలి మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ధన్వాడ ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీని (Ethanol Factory) వ్యతిరేకిస్తూ 12 గ్రామాల ప్రజలు ఈరోజు (బుధవారం) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందుకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం నుంచి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవ్వరినీ కూడా ఇథనాల్ కంపెనీ పరిసరాల్లోకి రానీయకుండా గట్టి భద్రతను కల్పించారు. అంతేకాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని హౌజ్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉగ్రరూపం దాల్చింది.


తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తుంటే పోలీసులు అరెస్ట్‌లు ఎలా చేస్తారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ ఏర్పాటు చేసే స్థలానికి పలు గ్రామాల ప్రజలు చేరుకున్నారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇథనాల్ కంపెనీ కోసం ఏర్పాటు చేసిన కంటైనర్‌కు నిప్పు పెట్టారు. పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇథనాల్ కంపెనీ వద్దంటూ ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


శాంతియుతంగా చేసే నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇథనాల్ కంపెనీ వల్ల జరిగే అనర్ధాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అఖిలపక్షం నేతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో చిత్తనూర్ వద్ద ఉండే ఇథనాల్ కంపెనీ నుంచి వచ్చే దుష్పరిణామాల నేపథ్యంలో రాజోలు వద్ద పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీని పెట్టవద్దంటూ చాలా రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు శాంతియుతంగా నిరసనలకు ప్రజలు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చర్యలతో శాంతియుత నిరసనలు కాస్తా ఉద్రిక్తతకు దారి తీసింది.


ఇవి కూడా చదవండి

కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 04 , 2025 | 12:00 PM