Share News

Lightning Strikes: పిడుగుపాటుకు ఆరుగురు రైతుల బలి

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:05 AM

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలిగొన్నాయి. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదలగా.. మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు.

Lightning Strikes: పిడుగుపాటుకు ఆరుగురు రైతుల బలి

  • పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు.. 12 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం

  • ఆదిలాబాద్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

  • హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో అధికంగా 14 సెం.మీ వర్షపాతం నమోదు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలను పిడుగులు బలిగొన్నాయి. ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు పిడుగుపాటుకు పొలంలోనే ప్రాణాలొదలగా.. మరో 12 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని బేల, గాదిగూడ మండలాల్లో గురువారం జరిగిన ఘటనలు విషాదాన్ని నింపాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని గాదిగూడ మండలం పిప్రి గ్రామానికి చెందిన 13మంది రైతులు పంట చేనులో విత్తనాలు విత్తుతుండగా.. అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో వీరంతా సమీపంలోని గుడిసెలోకి వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడడంతో నలుగురు రైతులు పెందూరు మాదవరావు (43), పెందూరు సుజాత (17), సిడాం రాంబాయి (40), మంగం భీంబాయి (30) అక్కడికక్కడే మృతి చెందారు. పెందూరు జంగు, పెందూరు శేఖు, సిడాం శంకర్‌, హిరాకుమ్ర ఈశ్వర్‌, మర్సుకోల అంజలి, మాగంలింగు, మర్సుకోల సోము, మంగం నందిని, గేడం శంభు(తొమ్మిది మంది) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తోటి రైతులు చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బేల మండలం సోన్‌కాస్‌ గ్రామానికి చెందిన కోవ సునీత(40) వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలోనే పిడుగు పడడంతో పంట చేనులోనే మృతి చెందింది. ఇదే మండలంలోని సాంగిడి గ్రామానికి చెందిన గేడం నందిని (39)పై కూడా పంట చేనులోనే పిడుగు పడడంతో ప్రాణాలు విడిచింది. అలాగే, ఉట్నూర్‌ మండలం కుమ్మరితండాకు చెందిన ధన్‌రాజ్‌, నిర్మల, కృష్ణబాయి పంట చేనులోని గుడిసెలో ఉండగా.. సమీపంలోనే పిడుగు పడడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.


గాయపడిన వారిని వెంటనే ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం పడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెల్లవారు జాము నుంచి పిడుగులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ శివారులోని శేరిలింగంపల్లిలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో అత్యధికంగా 14.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్‌లో 10.98 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 8.1, మెయినాబాద్‌ కేతిరెడ్డిపల్లిలో 7.83, షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 7.1, మెయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 6.28, చందన్వెల్లిలో 6.88, చేవెళ్ల మండలం కందవాడలో 6.65, మెయినాబాద్‌లో 6.08, యాచారం మండలం నల్లవెల్లిలో 5.9, కేశంపేటలో 5.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ మండలంలో అత్యధికంగా 6.1, పరిగిలో 5.80 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలోని మోర్తాడ్‌లో అత్యధికంగా 3.97 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌తోపాటు ఆర్మూర్‌, బోధన్‌, భీంగల్‌, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎగువన వర్షాలు పడుతుండడంతో.. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 2018 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. అలాగే, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్లలో 8, మహ్మదాబాద్‌ మండలంలో 6.92, గద్వాల జిల్లా ఇటిక్యాలలో 7.3, సెంటీమీటర్ల వర్షం కురవగా.. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 04:05 AM