KTR: కేసీఆర్ వెంట్రుక కూడా రేవంత్ పీకలేరు
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:27 AM
గతంలో చిల్లర పనులు చేసి, బ్యాగులు మోసి జైల్లో పడిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను కూడా జైల్లో పెట్టాలనే వికృత ఆలోచనతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఆయన ఓ చిల్లర ముఖ్యమంత్రి
మంత్రులకు శాఖలిచ్చే అధికారం లేనోడు
దృష్టి మళ్లించేందుకే విచారణ పేరిట కుట్రలు
రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందటం రేవంత్ నైజం
ఆయన గురువునే కేసీఆర్ తరిమేశారు
కాంగ్రెస్ను బజార్లో నిలబెడతాం: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : గతంలో చిల్లర పనులు చేసి, బ్యాగులు మోసి జైల్లో పడిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను కూడా జైల్లో పెట్టాలనే వికృత ఆలోచనతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘‘రేవంత్.. ఓ చిల్లర ముఖ్యమంత్రి. ప్రభుత్వం నడపడం చేతగాని అసమర్థ నాయకుడు. మంత్రులకు శాఖలు కేటాయించే అధికారం కూడా లేనోడు. చివరకు ఢిల్లీకి వెళ్లి మంత్రిత్వశాఖలు నిర్ణయించుకునే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్కు క్యాబినెట్ అంటే అర్థం కాదు. అది ఎలా పని చేస్తుందో కూడా తెలియదు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా.. రాజకీయ స్వార్థమే ముఖ్యమనుకొని రాక్షసానందం పొందడం రేవంత్రెడ్డి నైజం’’ అని మండిపడ్డారు. రేవంత్రెడ్డి గురువునే కరకట్టకు తరిమేసిన కేసీఆర్ను ఆయనేమీ చేయలేరని, కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం, ఫోన్ట్యాపింగ్, ఫార్ములా-ఈ రేసింగ్ విచారణల పేరిట రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని వేరే దేశంలో కడితే కేసీఆర్ పేరుతోపాటు ఆ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయేదని, తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పూరిత రాజకీయాలకు పావులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ను నిలబెట్టి రేవంత్రెడ్డి పైశాచికానందం పొందారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాలుగేళ్లలోనే ఆ ప్రాజెక్టు కట్టి తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు నోటీసులు ఇస్తారా? అని నిలదీశారు. రేవంత్ లాంటి చిల్లర వ్యక్తికి వంద జన్మలెత్తినా కేసీఆర్ గొప్పదనం అర్థం కాదన్నారు. ‘‘రూ.94వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలివి తక్కువ వాళ్లే అంటారంటూ నీ సతీమణి గీత తండ్రి సూదిని పద్మారెడ్డి చెప్పారు. వీలైతే నీకు పిల్లనిచ్చిన మామ దగ్గరికెళ్లి ఓ ఐదు నిమిషాలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుసుకో’’ అని రేవంత్కు సూచించారు. తమను ఇన్ని రకాలుగా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడతామని, ప్రజాసమస్యలను పక్కనపెట్టి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్న ఆ పార్టీని బజార్లో నిలబెడతామని హెచ్చరించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, కేసీఆర్ను వేఽధిస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.