Madan Lal Passes Away: వైరా మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.. ప్రముఖల సంతాపం
ABN , Publish Date - May 27 , 2025 | 10:47 AM
Madan Lal Passes Away: వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.

ఖమ్మం, మే 27: వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ (Vaira Former MLA Madan Lal) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే ఈరోజు (మంగళవారం) గుండెపోటు రావడంతో మాజీ ఎమ్మెల్యే తుదిశ్వాస విడిచారు. 2014 సెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లో చేరారు మదన్ లాల్. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా మదన్ లాల్ ఉన్నారు. మదన్ లాల్ మృతిపట్ల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో (BRS Chief KCR) పాటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ నేతలు సంతాపం తెలియజేశారు.
మదన్లాల్ మృతిపై కేసీఆర్
ఖమ్మం జిల్లా వైరా మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోత్ మదన్ లాల్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మదన్ లాల్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. మదన్ లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సీఎం రేవంత్ సంతాపం
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. మదన్ లాల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతిపట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మదన్ లాల్ అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మదన్ లాల్ మరణంతో వైరా నియోజకవర్గ బడుగు బలహీనవర్గాలు నిబద్ధత గల నాయకుడిని కోల్పోయారన్నారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు మంత్రి తుమ్మల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మదన్ లాల్ మృతి బాధాకరం: గుత్తా
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మృతి పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని ఆయన తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని, మదన్ లాల్ ఆత్మకు శాంతి కలగాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రార్ధించారు.
ఇవి కూడా చదవండి
కన్నప్పకు బిగ్ షాక్.. ఏం జరిగిందంటే
Read Latest Telangana News And Telugu News