CM Revanth Reddy: నేనున్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్లోకి రానివ్వ
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:41 AM
నేను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబమన్నారు.

కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబం
దుష్మన్ పరివారానికి కాంగ్రె్సలో జాగా లేదు
వారిది సెల్ఫ్ క్రియేషన్.. కవితది ఫ్యామిలీ డ్రామా
ఇప్పుడు ఆమె కూడా దయ్యంగా మారిపోయారా?
మోదీ చదివిన బడిలోనే నేనూ చదివా
మంత్రులకు పనిభారం ఎక్కువైతే తగ్గిస్తా
రాహుల్ది, నాది ‘రేర్’ కాంబినేషన్
2 రోజుల్లో ‘కాళేశ్వరం’పై ప్రజలకు వివరిస్తా
తెలంగాణ అభివృద్థిని కిషన్రెడ్డే అడ్డుకుంటున్నారు
కేటీఆర్ ఏం చెబితే అదే మాట్లాడతారు
ఏనాడైనా రాష్ట్రం కోసం మోదీతో మాట్లాడారా?
మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ది తెలంగాణ ద్రోహుల కుటుంబమన్నారు. కేసీఆర్ కుటుంబానిది సెల్ఫ్ క్రియేషన్ అని, కవితది ఫ్యామిలీ డ్రామా అని ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబంపై చర్చ లేకపోతే అందరి దృష్టిని తమవైపు తిప్పుకొనేందుకు ఆ కుటుంబం సెల్ఫ్ క్రియేషన్ చేస్తుందని చెప్పారు. అందులో భాగంగానే కవిత ఫ్యామిలీ డ్రామాకు తెరలేపారని చెప్పారు. ‘‘అసెంబ్లీ రౌడీ సినిమాలో బాషా క్యారెక్టర్ను చూస్తే కేసీఆర్ కుటుంబంలోని పాత్రలు అర్థమవుతాయి. బాషాలా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ సమయానికి తగిన పాత్రలు పోషిస్తున్నారు. అమాయకుడిని టార్గెట్ చేసి తమలో తాము కొట్టుకుంటున్నట్లు నటిస్తుంటారు. అలాగే ప్రజల్ని అమాయకులుగా భావించి ఈ కుటుంబం తమలో తాము గొడవ పెట్టుకున్నట్లు నటిస్తోంది. అందరూ కలిసి కాళేశ్వరం కమిషన్ దగ్గరకు పోయి ఆందోళన చేయడం చూస్తుంటేనే అదో డ్రామా అని అర్థమైపోతుంది. ఇంత కాలం కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత.. ఈ రోజు వాళ్లతో కలిసి కనిపించింది. అంటే కవిత కూడా దెయ్యంగా మారిపోయారా? ఆమే సమాధానం చెప్పాలి. నాకు ముందే తెలుసు కాబట్టి.. కేసీఆర్ కుటుంబమే కొరివి దెయ్యాలని చెప్పాను. అందుకే నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కుటుంబానికి చోటు లేదు. తెలంగాణకు కేసీఆర్, ఆయన కుటుంబం దుష్మణ్. అలాంటి దుష్మణ్ పరివారానికి కాంగ్రెస్ పార్టీలో జాగా లేదు’’ అని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్ని వందల సార్లయినా ఢిల్లీకి వస్తానన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎర్రవెల్లి ఫాంహౌం్సకు ఎందుకు వెళుతున్నారని నిలదీశారు. ఏబీవీపీ నుంచి తాను డ్రాపౌట్ విద్యార్థిని కాదని, ఎలివేట్ విద్యార్థినని చెప్పారు. ‘మోదీ బడిలో నేను చదవలేదు. మోదీ చదివిన బడిలోనే నేనూ చదివాను’ అని రేవంత్ తెలిపారు. మంత్రివర్గంలో ఎవరికైనా పనిభారం ఎక్కువనిపిస్తే తగ్గిస్తానన్నారు. హైదరాబాద్ వెళ్లిన తర్వాత సమీక్ష నిర్వహిస్తానని, అవసరమైతే మార్పులు చేస్తామని చెప్పారు. కొత్త మంత్రులకు తన దగ్గర ఉన్న శాఖలే కేటాయిస్తానన్నారు. కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని, కేంద్రం చట్టం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులోనైనా రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ కార్యదర్శుల్లోనూ సామాజిక న్యాయం పాటిస్తున్నామని, 29 ప్రభుత్వ శాఖల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులను నియమించామని తెలిపారు. బీఆర్ఎ్సపై ఏనాడూ కక్ష పూరిత రాజకీయాలు చేయలేదన్నారు. రాహుల్ గాంధీతో తనది రేర్ కాంబినేషన్ అన్నారు. రేర్ అంటే ‘రాహుల్-రేవంత్’ అని అభివర్ణించారు. కుల గణన అమలు గురించి వివరించేందుకే ఢిల్లీ వచ్చానన్నారు. కుల గణనలో తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్గా మారిందని తెలిపారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు తెలంగాణ కుల గణన తీరు తెన్నులను వివరించానని తెలిపారు.
కుల గణన సర్వే 97 శాతం పూర్తి..
కుల గణన సర్వేను 97 శాతం పూర్తి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ స్వలాభం కోసమే అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కుల గణన సర్వేలో తన ఇంటికి ఎవరూ రాలేదన్న కిషన్రెడ్డి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లలో కుల గణన సర్వే ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్కు తానే స్వయంగా సూచించానని తెలిపారు. కుల గణనలో భాగంగా ఇంటింటి సర్వే 60 రోజులు నిర్వహించామని, అప్పటికీ ఎవరైనా మిగిలితే ప్రత్యేకంగా నమోదు కేంద్రాలు ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఇంటింటి సర్వేలోనే 96 శాతం పూర్తయిందని, ప్రత్యేక కేంద్రాలు, టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఒకశాతం నమోదు చేసుకున్నారని, మొత్తం 97 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. నిజంగా కిషన్రెడ్డికి తన వివరాలు నమోదు చేసుకోవాలని ఉంటే, టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసినా సరిపోయేదని చెప్పారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణలు అమలు చేశామన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో 8 మంది రెడ్లు, నలుగురు వెలమ, ఒక కమ్మ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చోట్లు కల్పించారని.. దాదాపు 40 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చారని విమర్శించారు. తాము మాత్రం ఎస్సీల్లో నలుగురికి మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇచ్చామని చెప్పారు.
పనిభారం ఎక్కువనిపిస్తే తగ్గిస్తా..
మంత్రులకు పని భారం ఎక్కువనిపిస్తే తగ్గిస్తానని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, పీసీసీ ప్రెసిడెంట్, ఉప ముఖ్యమంత్రి లేకుండా మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుపై చర్చలెలా జరుగుతాయని ప్రశ్నించారు. కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయిస్తానని చెప్పారు. సీనియర్ మంత్రులకు శాఖల మార్పులు ఉన్నాయా? అనే ప్రశ్నకు.. మంత్రులు పని ఎక్కువ అవుతోందని భావిస్తే, ఆ భారం తగ్గిస్తానని బదులిచ్చారు. తన దగ్గర 12 శాఖలున్నాయని, హైదరాబాద్ వెళ్లగానే మిగతా మంత్రుల శాఖలపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నోళ్లకు పదవులు దక్కుతాయన్నారు. తన ఇంట్లో ఎవరూ అలా లేరని, అందుకే ఎవరికీ అవకాశం దక్కలేదని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిని కిషన్రెడ్డే అడ్డుకుంటున్నారు..
తెలంగాణ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డే అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. ‘‘కేటీఆర్ ఏం చెబుతారో, కిషన్రెడ్డి అదే మాట్లాడతారు. కేటీఆర్ మెట్రో విస్తరణను వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్రెడ్డికీ ఇష్టం లేదు. తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి ఏనాడైనా రాష్ట్ర అభివృద్ధిపై సమీక్ష చేశారా? ఆయన ప్రతిపాదించకపోవడం వల్లే తెలంగాణకు ప్రాజెక్టులు రావడం లేదు. మోదీ దగ్గర ఏనాడైనా తెలంగాణ కోసం మాట్లాడారా? చెన్నైకి కేంద్ర మంత్రి నిర్మల, బెంగళూరుకు ప్రహ్లాద్ జోషి మెట్రో రైల్ తీసుకెళ్లారు. మరి కిషన్రెడ్డి ఎందుకు మెట్రో విస్తరణకు అనుమతి తీసుకురాలేకపోతున్నారో చెప్పాలి. నేను ఢిల్లీకి వస్తే, ప్రధానిని కలిస్తే తప్పుపడుతున్న కిషన్రెడ్డి.. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలతో రాష్ట్ర ప్రాజెక్టులపై ఎందుకు ప్రధానిని కలవడం లేదో చెప్పాలి. ఆయన సమీక్ష చేస్తానంటే నేనే స్వయంగా అధికారులందరినీ తీసుకొని ఢిల్లీ వస్తా. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో చాలా వేగంగా స్పందించానని కేంద్ర మంత్రి గడ్కరీ నాకు ఫోన్ చేసి అభినందించారు. అలాంటిది.. కిషన్రెడ్డి అభివృద్ధి చేద్దామంటే కలిసి పనిచేస్తాం కదా? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని మోదీ, అమిత్ షా ఆరోపించారు. ఇదే నిజమైతే బీజేపీ ఎంపీ ఈటల కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ఎలా చెబుతున్నారు. ఈటల వ్యాఖ్యలనే కిషన్రెడ్డి సైతం సమర్థిస్తున్నారు’’ అని రేవంత్రెడ్డి చెప్పారు. కాగా, అసమానతలు ఉన్నంతకాలం నక్సలిజం అంతం కాదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన భూసంస్కరణలతో నక్సలిజం తగ్గుముఖం పట్టిందన్నారు. నక్సలిజమంటే ఫిలాసఫీ అని, శాంతిభద్రతల సమస్య కాదని చెప్పారు.
రెండు రోజుల్లో కాళేశ్వరంపై ప్రజలకు వివరిస్తా
రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాళేశ్వరం అంశంపై ప్రజలకు వివరిస్తానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘18 నెలల్లో ఎప్పుడూ బీఆర్ఎ్సపై కక్ష పూరిత రాజకీయాలు చేయలేదు. అవినీతి ఆరోపణలపై కమిషన్లు వేశాం. కాళేశ్వరంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఘోష్తో కమిషన్ వేశాం. కేసీఆర్తో పాటు అందరూ కాళేశ్వరం కమిషన్ ముందు తమ అభిప్రాయాలను తెలిపారు. కేసీఆర్ తన అభిప్రాయాలను చెప్పారు కాబట్టి.. కాళేశ్వరంపై నేనూ నా అభిప్రాయాలు చెబుతా. తెలంగాణలోని నాలుగున్నర కోట్ల ప్రజలే నాకు కమిషన్ కాబట్టి.. వారికి అర్థమయ్యేలా నా అభిప్రాయాలు వెల్లడిస్తా’’ అని రేవంత్రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్ఎస్ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..