MLC Kavitha: నిజామాబాద్లో కవిత.. కనిపించని సందడి
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:09 AM
బీఆర్ఎస్లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత.. గురువారం సొంత జిల్లా నిజామాబాద్లో పర్యటించారు.

సీహెచ్ కొండూర్లో లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ
నిజామాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్ఎస్లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్న ఎమ్మెల్సీ కవిత.. గురువారం సొంత జిల్లా నిజామాబాద్లో పర్యటించారు. ఆమె నిజామాబాద్కు వచ్చిన ప్రతీసారి హడావుడి చేసే గులాబీ నేతలు, శ్రేణులు ఈ సారి దూరంగా ఉన్నారు. ఆమెను బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరూ కలవలేదు. గతంలో జిల్లాకు వచ్చి న ప్రతీసారి కవిత ఇంటితో పాటు కార్యాలయం వద్దకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చేవారు. ఈ సారి జాగృతి కార్యకర్తలు మాత్రమే కవిత వెంట ఉన్నారు. జిల్లాలోని నందిపేట మండలం సీహెచ్ కొండూర్లోని శ్రీరాజ్యలక్ష్మి సమేత లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గురువారం జరిగిన బ్రహ్మోత్సవాల్లో కవిత పాల్గొన్నారు. ఆమె భర్త అనిల్, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో హోమం నిర్వహించారు. మూడేళ్ల క్రితం ఈ దేవాలయాన్ని కవిత కుటుంబ సభ్యులే నిర్మించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు కవిత హాజరవుతున్నారు.
బుధవారం రాత్రే నిజామాబాద్కు చేరుకున్న కవిత నగరంలోని తన సొంతిట్లో ఉన్నారు. ఇంతకుముందు కవిత హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు చేరుకోగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన పార్టీ నేతలంతా వచ్చేవారు. ఈ సారి ఆ సందడి లేకపోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు సూదాం లక్ష్మి, నందిపేట బీఆర్ఎస్ నేత సాగర్, మాజీ జడ్పీటీసీ సభ్యులు సుమనారెడ్డి, ఐత సుజాతలు కవితను ఇంటి వద్ద కలిశారు. అలాగే సీహెచ్ కొండూర్లో నగర మాజీ మేయర్ నీతూకిరణ్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున కవితను కలిశారు. మరోవైపు.. కవిత వద్దకు ఎవరెవరు నాయకులు వెళ్తున్నారన్న విషయమై జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News