MLC Kavitha: మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులిస్తారా?
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:55 AM
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులిచ్చింది.

కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యను ఖండిస్తున్నా
మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం: కవిత
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులిచ్చింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతూ.. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ పైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
ప్రతి సందర్భంలోనూ ప్రజా గాయకుడు గద్దర్ పేరును జపంచేసే కాంగ్రెస్ సర్కార్ ఆయన్ను అవమానించడం తగదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న సినీ అవార్డుల ఆహ్వాన పత్రికలో గద్దర్ ఫొటో లేకపోవడం బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి ఆయన్ను గౌరవించాలని కోరుతున్నానని పేర్కొన్నారు.