Tummala: కనకగిరికొండల్లో మంత్రి తుమ్మల!
ABN , Publish Date - May 31 , 2025 | 04:44 AM
అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొండ కోనల ప్రాంతం.. ఎత్తయిన కొండలతో పచ్చని చెట్లతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అడవి అందాలు దాని సొంతం..

ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంత సందర్శన
ఎమ్మెల్యే రాగమయితో కలిసి వన బస్సు ప్రారంభం
పెనుబల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): అది ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కొండ కోనల ప్రాంతం.. ఎత్తయిన కొండలతో పచ్చని చెట్లతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే అడవి అందాలు దాని సొంతం.. ఎకో టూరిజం ద్వారా రూ.3.50 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ కనకగిరి గుట్టల్లోని పలు ప్రదేశాలను శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. పులిగుండాల ప్రాజెక్టు నుంచి వీరభద్రస్వామి ఆలయం వరకు అడవిలో సుమారు 3 గంటల పాటు పర్యటించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి వన బస్సును ప్రారంభించారు. ప్రాచీన కట్టడమైన వీరభద్రస్వామి ఆలయంతోపాటు పులిగుండాల ప్రాంతంలో పర్యాటకులు రెండు, మూడు రోజుల పాటు బస చేసేందుకు ఏర్పాటు చేసిన కుటీరాలను తుమ్మల పరిశీలించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.