Mahesh Kumar Goud: హరీశ్, ఈటల భేటీపై పక్కా సమాచారం
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:38 AM
కాళేశ్వరం అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీశ్ రావు, ఈటల భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు.

పదేళ్ల పాలనపై చర్చకు హరీశ్రావు సిద్ధమా? .. తెలంగాణ పునర్నిర్మాణం దిశగా పాలన
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హరీశ్ రావు, ఈటల భేటీ అయ్యారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లోను, అనంతరం మీడియాతోను ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని, కంచే చేనును మేసినట్లుగా.. ప్రభుత్వ ఆస్తులను నాశనం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ హరీశ్ రావుకు సవాల్ విసిరారు. దాదాపు రూ. 1.20 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీరు రాలేదు కానీ.. ఆ ప్రాజెక్టు కాస్తా కూలేశ్వరంగా మారిందని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తుపై కవిత చేసిన వ్యాఖ్యలకు ముందుగా హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబంలో నాలుగు ముక్కలాట నడుస్తోందని, ఈ నేపథ్యంలో హరీశ్ రావు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఆ విధ్వంసాన్ని అధిగమిస్తూ తెలంగాణ పునర్నిర్మాణం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందని అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ టీపీసీసీ రూపొందించిన పోస్టర్ను మహేశ్ గౌడ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీలు వి. హనుమంతరావు, అంజన్కుమార్యాదవ్, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, అమెర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గన్ పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి మహేశ్ గౌడ్ నివాళిని అర్పించారు.
కష్ట పడేవారికి తగిన గుర్తింపు
రాజకీయాల్లో ఓపిక, కచ్చితత్వం ఉండాలని, అప్పుడే పార్టీలో కష్ట పడేవారికి కచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందని మహేశ్ గౌడ్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డితో చర్చించి పార్టీ పదవుల్లో సీనియర్ మహిళా కార్యకర్తలకు తగిన అవకాశాలు కల్పిస్తామన్నారు. గాంధీభవన్లో జరిగిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ మేరకు హామీ ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా వేటు తప్పదని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News