Share News

ఈ మారణహోమాన్ని ఆపాలి: జస్టిస్‌ చంద్రకుమార్‌

ABN , Publish Date - May 22 , 2025 | 04:04 AM

మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపి మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి అని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఎన్‌కౌంటర్లను హత్యాకాండగా ఖండిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని వామపక్షాలు కోరుతున్నాయి.

ఈ మారణహోమాన్ని ఆపాలి: జస్టిస్‌ చంద్రకుమార్‌

  • చర్చలతో సమస్యకు పరిష్కారం: డి.రాజా, కూనంనేని

  • మధ్య భారతంలో మారణహోమాన్ని ఆపాలి

  • మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి

  • అది ఎన్‌కౌంటర్‌ కాదు.. హత్యాకాండ: హరగోపాల్‌

  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి: న్యూ డెమోక్రసీ

  • హత్యాకాండ.. ఫాసిస్టు చర్య: పోటు రంగారావు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి కాల్పుల విరమణ పాటించాలని, మధ్యభారతంలో మారణహోమాన్ని ఆపాలని శాంతి చర్చల కమిటీ రాష్ట్ర చైర్మన్‌ జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. హనుమకొండలో బుధవారం నిర్వహించిన ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర, అస్సాం, మణిపూర్‌ ఉద్యమకారులతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్న కేంద్రం.. మావోయిస్టులతో చర్చలు జరిపితే సమస్య ఏంటని ప్రశ్నించారు. కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించినా.. వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా, అబూజ్‌మఢ్‌ ఎన్‌కౌంటర్‌ను శాంతి చర్చల సమన్వయ కమిటీ ఒక ప్రకటనలో ఖండించింది. కేంద్రం తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టులతో శాంతిచర్చలను ప్రారంభించాలని కోరింది. కర్రెగుట్టలు, అబూజ్‌మఢ్‌లో జరిగింది ఎన్‌కౌంటర్లు కాదని, హత్యా కాండ అని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ వ్యాఖ్యానించారు. మావోయిస్టుల మృతదేహాలను మార్చులో భద్రపర్చాలని, గుర్తు పట్టిన శవాలను వారి బంధువులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఓ వైపు శాంతి చర్చలకు మావోయిస్టు పార్టీ పదే పదే కోరుతున్నా.. పట్టించుకోకుండా ఎన్‌కౌంటర్లకు పాల్పడడం హేయమని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ తెలంగాణ, ఏపీ కార్యదర్శులు పి.సూర్యం, దివాకర్‌ ధ్వజమెత్తారు. ఆపరేషన్‌ కగార్‌ ను వెంటనే నిలిపివేసి, బలగాలను వెనక్కి రప్పించాలని, ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నంబాల ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం నేతలు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, నారాయణరావు విచారం వ్యక్తం చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన బలగాలను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మెచ్చుకోవడం శోచనీయమన్నారు.


దేశ పౌరులమీదే యుద్ధం చేస్తూ, చంపడం అన్యాయమని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు నిరసన వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు సిద్ధమన్న మావోయిస్టు పార్టీ ప్రతిపాదనను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా మోదీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు. అంబూజ్‌మఢ్‌ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖండించారు. చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వామపక్ష భావజాలాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్‌ కగార్‌ చేపట్టిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్‌కౌంటర్లు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం బాధాకరమన్నారు. నంబాల కేశవరావుతోపాటు మరికొంత మందిని కేంద్ర బలగాలు కాల్చి చంపడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. అనేక పర్యాయాలు చర్చల కోసం మావోయిస్టులు విజ్ఞప్తి చేసినా కేంద్రం మూర్ఖంగా ఎన్‌కౌంటర్లకు పాల్పడుతోందని మండిపడ్డారు.

Updated Date - May 22 , 2025 | 04:14 AM