Jupally: మీ భూములు ఎక్కడికీ పోవు!
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:03 AM
అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ఇచ్చిన భూములను వాపసు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీల గిరిజనులెవ్వరూ..

ఆదివాసీలు ఆందోళన చెందొద్దు: జూపల్లి
ఉట్నూర్, జూన్27 (ఆంధ్రజ్యోతి): అటవీ హక్కుల చట్టం ద్వారా గిరిజనులకు ఇచ్చిన భూములను వాపసు తీసుకోవడం జరగదని, ఈ విషయంలో ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీల గిరిజనులెవ్వరూ ఆందోళన చెందొద్దని, ఆధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 49కు ఇంకా గెజిట్ విడుదల చేయలేదని ఆయన చెప్పారు.
‘‘ఆదివాసీలకు ఎట్టి పరిస్థితుల్లో హాని జరగనివ్వం. ఎవ్వరూ ఆందోళన చెందొద్దని రెండు చేతులు జోడించి కోరుతున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కొమురంభీం ప్రాంగణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ గిరిజనుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ గిరిజనులు పేర్కొన్న పలు అంశాలపై సమాధానమిచ్చారు.