Share News

Jaggareddy: నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్‌ఎస్‌ నేతవా?

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:29 AM

ఈటల రాజేందర్‌.. నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్‌ఎస్‌ నేతవా? అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి నిలదీశారు. గతంలో పీసీసీ చీఫ్‌గా చేసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డి ఒక్కటే విధానంతో ఉన్నారని తెలిపారు.

Jaggareddy: నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్‌ఎస్‌ నేతవా?

కేసీఆర్‌, హరీశ్‌పై డైలాగ్స్‌ వేస్తివి కదా.. ఏమైంది?.. కాళేశ్వరం డిజైన్‌ తప్పు.. అది జగమెరిగిన సత్యం

  • ఢిల్లీ నేతల డైరెక్షన్‌లోనే కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చావా?

  • బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై జగ్గారెడ్డి మండిపాటు

  • అప్పుడైనా, ఇప్పుడైనా రేవంత్‌ది ఒకటే విధానమని వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ఈటల రాజేందర్‌.. నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్‌ఎస్‌ నేతవా? అని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి నిలదీశారు. గతంలో పీసీసీ చీఫ్‌గా చేసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌ రెడ్డి ఒక్కటే విధానంతో ఉన్నారని తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లినప్పుడు కేసీఆర్‌, హరీశ్‌పై పెద్ద పెద్ద డైలాగ్స్‌ వేస్తివి కదా.. కమిషన్‌ ముందుకెళ్లగానే ఏమైంది? అని ప్రశ్నించారు. ఈటల స్టేట్‌మెంట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమర్థిస్తారా? లేక వ్యతిరేకిస్తారా? వెంటనే జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


‘‘కమిషన్‌ విచారణలో నీ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని కేసీఆర్‌తో కమిట్‌ అయ్యావా? అది కూడా కిషన్‌రెడ్డికి చెప్పే కమిట్‌ అయినట్లు మాకు అనుమానం ఉంది. బీజేపీ ఢిల్లీ నేతల డైరక్షన్‌లోనే కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టుగా ఉంది’’ అని మండిపడ్డారు. పదేళ్లపాటు బీఆర్‌ఎ్‌సకు కాళేశ్వరం ఏటీఎంలా మారిందంటూ స్వయంగా మోదీ, అమిత్‌షా విమర్శించారని, ఇప్పుడు కూడా ఆ మాటకే కట్టుబడి ఉన్నారా? లేదా? వెంటనే బదులివ్వాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం డిజైన్‌ తప్పు అనేది.. జగమెరిగిన సత్యమని, ఆయా అక్రమాల్లో ఈటల కూడా భాగస్వామేనని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌.. మొదటి నుంచి కాళేశ్వరం అక్రమాలు బయట పెడుతూనే ఉన్నారని, ప్రజల సొమ్ము కాపాడే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై అప్పుడెప్పుడో టెంప్ట్‌ అయ్యానని, త్వరలోనే ఆ ప్రాజెక్టులో జరిగిన అక్రమాల గుట్టు విప్పుతానని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 04:29 AM