Jagga Reddy: విమర్శలకూ ఓ హద్దుండాలి
ABN , Publish Date - May 07 , 2025 | 04:19 AM
బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితిని రఘునందన్ తెచ్చారని ధ్వజమెత్తారు.

ప్రధానిని మోసగాడంటే మీరు భరిస్తారా?
మీరు సీఎంను తిడితే.. మేం మోదీని తిట్టలేమా?
మేం నోరు విప్పితే మీరు నిలబడగలరా?
కానీ, ప్రధాని మోదీని మేము గౌరవిస్తాం
రాహుల్.. మాకు ఆ పద్ధతిని నేర్పించారు
సత్తా లేనిదే.. ఏకకాలంలో రుణమాఫీ చేశామా?
హరీశ్ పుణ్యమా అని గెలిచినవ్.. మళ్లీ గెలవలేవు
బీజేపీ ఎంపీ రఘునందన్పై తూర్పు జగ్గారెడ్డి ధ్వజం
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): ‘‘మా సీఎం రేవంత్రెడ్డిని నువ్వు తిడితే.. మీ ప్రధాని మోదీని మేము తిట్టలేమా? ప్రధానిని పట్టుకుని మోసగాళ్లకు మోసగాడని మేమంటే మీరు భరిస్తారా? విమర్శలకూ ఓ హద్దుండాలి. బూతులు మాట్లాడితే ఎట్లా? మేం నోరు విప్పితే మీరు నిలబడగలరా?’’ అని బీజేపీ ఎంపీ రఘునందన్ను ఉద్దేశించి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సీఎల్పీ ఆవరణలో మంగళవారంఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని ఉద్దేశించి తాము మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది రఘునందన్రావేనని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సత్తా గురించి ఆయన మాట్లాడుతున్నారని, సత్తా లేనిదే ఏకకాలంలో రైతులకు రూ. 22 వేల కోట్ల మేర రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. సత్తా లేకుండానే ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశారా?.. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేశారా? అని నిలదీశారు. ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామంటూ గతంలో మోదీ హామీ ఇచ్చారని, దాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారని, ఈ 11 ఏళ్ల పాలనలో 22 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలని అన్నారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ మోసగాళ్లకు మోసగాడు మోదీ అంటే రఘునందన్ తట్టుకోగలరా? అని నిలదీశారు. కానీ, తాము ప్రధాని మోదీని గౌరవిస్తామని, తమ నాయకుడు రాహుల్గాంధీ తమకు నేర్పిన పద్ధతి అదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి దిక్కే లేదన్నారు. ఏదో హరీశ్రావు పుణ్యమా అని రఘునందన్రావు గెలిచాడని, మళ్లీ గెలిచేదీ లేదని అన్నారు. పదేళ్ల పాటు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సంసారం చేశాయని, కేసీఆర్ సర్కారుకు అప్పులు ఇప్పించిందే కేంద్రంలోని బీజేపీ అని ఆరోపించారు. నాలుకలు చీరడం కేటీఆర్ వల్ల కాదని, సినిమా స్ర్కిప్టును ఆయన చదువుతున్నారని ఎద్దేవా చేశారు.