రెండో రోజూ సోదాలు
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:00 AM
సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండోరోజైన బుధవారం కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు.

దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి.. ఆయన ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు
పుష్ప 2 సినిమా పారితోషికంపై ఆరా
నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజు తదితరుల నివాసాల్లో సోదాలు
నిర్మాతల బినామీల బ్యాంకు ఖాతాల గుర్తింపు
కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాల్లో వ్యత్యాసం!
సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు
నా ఒక్కడిపైనే జరగడం లేదు: దిల్ రాజు
సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండోరోజైన బుధవారం కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఇటీవల విడుదలైన చిత్రాలు పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, వారసుడు సినిమాలకు సంబంధించిన లెక్కలపై ప్రధానంగా దృష్టి సారించారు. పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్ బుధవారం హైదరాబాద్ చేరుకోవటంతో శంషాబాద్ విమానాశ్రయంలోనే ఐటీ అధికారులు ఆయనను కలుసుకొని.. నేరుగా తన ఇంటికి తీసుకుని వచ్చారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న పారితోషికం గురించి వారు ఆరా తీసినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు నిర్మాతలు నవీన్ ఏర్నేని, యలమంచలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజుతోపాటు ఆయన కుటుంబసభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
కాగా, ఏరియాల వారీగా సినిమాను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల్లో చాలావరకు నల్లధనం ఉంటుందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారి బ్యాంకు ఖాతాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన పెట్టుబడి, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తున్నపుడు పలు అవకతవకలు బయటపడినట్లు సమాచారం. ఇటీవల విజయవంతమైన సినిమాల బ్యాలెన్స్షీట్లు, ఐటీ శాఖకు ఆయా నిర్మాణ సంస్థలు అందించిన వివరాల్లో కూడా భారీ వ్యత్యాసమున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సినిమా కలెక్షన్లకు సంబంధించిన జీఎస్టీ రిటర్నుల్లో కూడా వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం.
భారీ కలెక్షన్లపై దృష్టి
తక్కువ పెట్టుబడితోనే నిర్మాణం పూర్తి చేసుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు తొలి వారంలోనే రూ.200 కోట్ల కలెక్షన్లు, పుష్ప 2 సినిమాకు ఇప్పటి వరకూ రూ.1850 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాటిపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. తమిళ హీరో విజయ్ నటి ంచిన వారసుడు సినిమాకు సంబంఽధించి దిల్ రాజు సంస్థ చూపించిన లెక్కలపైనా అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఐటీ సోదాలు తనను ఒక్కడినే లక్ష్యంగా చేసుకొని జరగడం లేదని, సినీ రంగంలో చాలాచోట్ల జరుగుతున్నాయని నిర్మాత దిల్రాజు పేర్కొన్నారు. ఐటీ అధికారులు అడిగిన అన్ని వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇచ్చామని, పన్ను చెల్లింపునకు సంబంధించి తేడాలుంటే వారిచ్చే నోటీసుల ఆధారంగా వ్యవహరిస్తామన్నారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి)
ఇవి కూడా చదవండి..
BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్
Hyderabad: గ్రేటర్లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’