Share News

Telangana: హైదరాబాద్‌కు మళ్లీ ముప్పు తప్పదా..

ABN , Publish Date - May 05 , 2025 | 12:27 PM

మూడేళ్ల క్రితం చేపట్టిన పనులూ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్‌ మార్చడంలో జాప్యం, ఇతరత్రా కారణాలతో నెమ్మదించిన పనులను వేగవంతం చేసే కనీస ప్రయత్నం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం చేయడం లేదు. ఎస్‌ఎన్‌డీపీ కోసం ప్రత్యేక విభాగం, అధికారులున్నా..

Telangana: హైదరాబాద్‌కు మళ్లీ ముప్పు తప్పదా..
Hyderabad Floods

  • కదలని వరద కాలువ పనులు

  • మరో నెలన్నరలో మాన్‌సూన్‌

  • పలు ప్రాంతాల్లో అసంపూర్తిగా

  • ఎస్‌ఎన్‌డీపీ ఫేజ్‌-1

  • పట్టించుకోని జీహెచ్‌ఎంసీ

  • పైపులైన్లు, స్తంభాలు మార్చే పనులూ పెండింగ్‌

  • బాక్స్‌ డ్రైన్ల నిర్మాణం, నాలాల

  • పునరుద్ధరణ పనులపై ప్రభావం

హైదరాబాద్‌, మే 5 : మరో నెలన్నర రోజుల్లో మాన్‌సూన్‌ సీజన్‌ మొదలవనుంది. వాన పడితే నగరవాసులకు వరద తిప్పలు.. ముంపు బాధలు తప్పవు. వీటికి చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)లో భాగంగా మూడేళ్ల క్రితం చేపట్టిన పనులూ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్‌ మార్చడంలో జాప్యం, ఇతరత్రా కారణాలతో నెమ్మదించిన పనులను వేగవంతం చేసే కనీస ప్రయత్నం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం చేయడం లేదు. ఎస్‌ఎన్‌డీపీ కోసం ప్రత్యేక విభాగం, అధికారులున్నా పనులపై దృష్టి సారిస్తోన్న దాఖలాలు లేవు. ఏడాదిగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లో మరోసారి ముంపు ముప్పు తప్పేలా లేదు.


సా..గుతున్న పనులు..

2020లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదలకు ఎస్‌ఎన్‌డీపీకి అధికారులు శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా గ్రేటర్‌లోని 37 ప్రాంతాల్లో రూ.747.35 కోట్లతో బాక్స్‌ డ్రైన్‌ల నిర్మాణం, నాలాల విస్తరణ, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేపట్టారు. పలు ప్రాంతాల్లో పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. అంబర్‌పేట సీపీఎల్‌లో స్థలం ఇచ్చేందుకు పోలీస్‌ విభాగం అంగీకరించకపోవడంతో ఇక్కడ వరద నీటి ముంపు సమస్యకు పరిష్కారం లభించడం లేదు.


  • సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలోని హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలా వెంట పలు ప్రాంతాల్లో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులూ సాగుతున్నాయి. రత్నానగర్‌ వద్ద 51.6 మీటర్ల మేర ఆస్తుల సేకరణ పెండింగ్‌లో ఉంది.

  • బల్కాపూర్‌ నాలా పునరుద్ధరణలో భాగంగా హకీంపేట నుంచి మదర్సా వరకు పనులు పూర్తయ్యాయి. మిలిటరీ ఏరియాలో పనులు పురోగతిలో ఉండగా.. ఫస్ట్‌ లాన్సర్‌లో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం నత్తనడకన సాగుతోంది.

  • చార్మినార్‌ జోన్‌ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సున్నం చెరువు వరకు చేపట్టిన బాక్స్‌ డ్రైన్‌ పనులదీ అదే పరిస్థితి. ఇక్కడ 1600ఎంఎం డయా తాగునీటి పైపులైన్‌ను వాటర్‌బోర్డు, 11 కేవీ విద్యుత్‌ స్తంభాలను టీజీఎస్‌పీడీసీఎల్‌ మార్చాల్సి ఉంది.

  • ముస్తఫా మసీద్‌ నవాబ్‌సాహెబ్‌ కుంట నుంచి ఇరామిక్స్‌- సియోన్‌ హైస్కూల్‌, రంజన్‌ కాలనీ నుంచి చందులాల్‌ బారాదారి సబ్‌స్టేషన్‌ వరకు ఇంద్రానగర్‌ నాలా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉండగా 600ఎంఎం డయా తాగునీటి సరఫరా పైపులైన్‌, 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు మార్చకపోవడంతో నిలిచిపోయాయి.

  • శేరిలింగంపల్లి జోన్‌లోని పంచవటి కాలనీ నుంచి సన్‌రైజ్‌ రెగ్లాస్‌, మల్కం చెరువు నుంచి ఇబ్రహీంబాగ్‌ చెరువు వరకు మూడు చోట్ల కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం కోసం స్థల సేకరణ జరగకపోవడంతో పనులు నిలిచిపోయాయి.


ఎందుకీ నిర్లక్ష్యం..

పురోగతిలో ఉన్న ఎస్‌ఎన్‌డీపీ మొదటి దశ పనులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు సేకరించాల్సి ఉంది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపడుతోన్న పనుల కోసం సర్కారీ శాఖలను ఒప్పించి స్థల సేకరణ చేయాల్సి ఉండగా ఆ స్థాయి చొరవ చూపే అధికారి జీహెచ్‌ఎంసీలో కనిపించడం లేదు. గత కమిషనర్‌ పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, సమీక్షలు నిర్వహించినా సమస్య కొలిక్కి రాలేదు. సంబంధిత విభాగం అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్‌ ఆస్తుల సేకరణకు పట్టణ ప్రణాళికా విభాగంతో సమన్వయం చేసుకోవడంలోనూ ఇంజనీరింగ్‌ అధికారులు విఫలమవుతున్నారు. వాటర్‌బోర్డు, టీజీఎస్పీడీసీఎల్‌తో తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ స్తంభాలు మార్చే పనులు చేయించడంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ఎప్పుడూ బిజీగా ఉన్నట్టు కనిపించే ఉన్నతాధికారి.. ఎస్‌ఎన్‌డీపీ పనులను మాత్రం పట్టించుకోవడం లేదు.


Also Read:

ఢిల్లీతో మ్యాచ్‎కు ముందే..కావ్య మారన్ జట్టులో కీలక మార్పు..

అదృష్టవంతులు అంటే వీళ్లే..

మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి

For More Telangana News and Telugu News..

Updated Date - May 05 , 2025 | 12:27 PM